లాక్ డౌన్ సమయంలో బయట తిరుగుతున్న భర్తపై ఫిర్యాదు చేసిన భార్య .. రీజన్ ఇదే
కరానావైరస్ భారత దేశం మీద తన ప్రభావం చూపిస్తుంది. కరోనా వైరస్ విస్తరించకుండా ప్రభుత్వం అమలు చేస్తోన్న లాక్డౌన్ కొంతమేర సత్ఫలితాలను ఇస్తుందని చెప్పొచ్చు . అయితే లాక్ డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా బయట తిరిగే కొందరు ప్రబుద్ధులకు భార్యలే బుద్ధి చెప్తున్న ఘటనలు కొన్ని చోటు చేసుకుంటున్నాయి. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాడంటూ తన భర్తపై ఫిర్యాదు చేసింది ఓ మహిళ. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది.
భర్తపైనే ఫిర్యాదు చేసిన భార్య
అసలు విషయానికి వస్తే కేరళ రాష్ట్రంలో ఎర్నాకులం జిల్లాలోని మువత్తుప్పుజాలో నివసిస్తున్న ఒక మహిళ భర్తపై ఫిర్యాదు చేసింది. లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా బయట తిరుగుతున్నాడని ఫిర్యాదు చేసింది ఆ ఇల్లాలు . తన భర్త బైక్ నంబర్ తో సహా ఫిర్యాదులో పేర్కొంది. ఏదో సరదాకి భర్తపై ఫిర్యాదు చేశారనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఆమె చాలా సీరియస్ గా తన భర్తపై కేసు నమోదు చేసి లోపల వెయ్యాలని కూడా చెప్తోంది .
లాక్ డౌన్ లెక్క చెయ్యకుండా తిరుగుతున్నాడని ఫిర్యాదు
లాక్డౌన్ను లెక్కచేయకుండా బైక్ వేసుకుని తిరిగేస్తున్న తన భర్త వల్ల తన కుటుంబానికి ,పిల్లలకు , తనకు ఏం హాని జరుగుతుందో అని భయపడుతుంది. పలు మార్లు భర్తకు నచ్చజెప్పినా ఆయన వినకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తుంది సదరు మహిళ. కరోనా వైరస్ ఒక మహమ్మారిగా రోజురోజూకూ విస్తరిస్తోన్న నేపధ్యంలో ఎక్కడ, ఎవ్వరికి వైరస్ ఉందో తెలియని పరిస్థితుల్లో భర్త చెప్పిన మాట వినకపోవటంతో ఆమె ఈ చర్యకు పాల్పడింది .
పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తామన్నా సరే చట్టపరంగా శిక్షించమంటున్న భార్య
భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించాలని భావించిన పోలీసులు సదరు మహిళను ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని కోరారు. అయితే, ఆ మహిళ మాత్రం తన భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఎంతచెప్పినా వినకుండా బయట తిరిగే వ్యక్తి ఎక్కడ వైరస్ అంటించుకొని వస్తాడో అని ఆమె భయపడుతుంది .ఆయనను కంట్రోల్ చెయ్యకుంటే ఆయనతో మా కుటుంబానికి కూడా ప్రమాదమే అంటోంది సదరు మహిళ. ఏది ఏమైనా ఇలా కాళ్ళు ఆగకుండా బయట తిరిగే భర్తలు ఒక్కసారి ఇళ్ళల్లో వారి భయాలను గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది .