భర్తతో హనీమూన్కు భార్య... ఇంటికొచ్చాక అసలు విషయం తెలిసి షాక్...
అతనికి పెళ్లయింది.. భార్యతో హనీమూన్ ప్లాన్ చేశాడు. అనుకున్నట్లుగానే ఇద్దరూ ఊటీ వెళ్లి గడిపారు. సంతోషంగా ఇంటికి తిరిగొచ్చారు. ఓరోజు అనుకోకుండా ఆమె భర్త సెల్ఫోన్ను పరిశీలించింది. అందులో ప్రియురాలితో దిగిన ఫోటోలు కనిపించాయి. అవి కూడా ఊటీలో దిగినవే కావడంతో ఆమె షాక్కి గురైంది. ఇదేంటని నిలదీస్తే...అప్పుడు అసలు విషయం చెప్పాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
అసలేం జరిగింది...
కర్ణాటకలోని బళ్లారికి చెందిన మంజునాథ్ సండూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో బెంగళూరుకు చెందిన యువతి(21)తో వివాహం జరిగింది. పెళ్లయిన మొదటి నెల మంజునాథ్ ఆమెతోనే ఉన్నాడు. ఆ తర్వాత ఉద్యోగ రీత్యా సండూరు వెళ్లాడు. వీకెండ్స్లో భార్య వద్దకు వచ్చి వెళ్తుండేవాడు. ఇదే క్రమంలో మార్చిలో హనీమూన్కి ప్లాన్ చేశాడు. అనుకున్నట్లుగానే ఇద్దరూ ఊటీకి వెళ్లారు.
భర్త అసలు ప్లాన్ వేరే..
కానీ భార్యకు తెలియకుండా.. అంతకుముందే ప్రియురాలిని కూడా మంజునాథ్ ఊటీకి పంపించి ఓ హోటల్లో ఉంచాడు. ఆ తర్వాత అదే హోటల్లో భార్యతో కలిసి దిగాడు. ఇద్దరినీ వేర్వేరు గదుల్లో ఉంచాడు. పగటి పూట ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి... ప్రియురాలితో కలిసి బయటకెళ్లి షికార్లు చేసేవాడు. రాత్రిపూట భార్యతో గడిపేవాడు. ఇలా భార్యకు తెలియకుండా ఏక కాలంలో ఆమెతో,ప్రియురాలితో గడిపాడు.
ఇలా బయటపడింది...
ఓ వారం తర్వాత హనీమూన్ ముగించుకుని భార్యతో కలిసి బెంగళూరు చేరుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగ రీత్యా మళ్లీ సండూరు వెళ్లిపోయాడు. ఎప్పటిలాగే వీకెండ్స్లో ఇంటికొచ్చేవాడు. అలా ఓరోజు అనుకోకుండా ఆమె అతని సెల్ఫోన్ని పరిశీలించింది. అందులో ప్రియురాలితో దిగిన సెల్ఫీలు కనిపించాయి. జాగ్రత్తగా పరిశీలిస్తే అవన్నీ ఊటీలో దిగినవేనని అర్థమైంది.
Recommended Video
నిలదీస్తే నిజం ఒప్పుకున్నాడు...
ప్రియురాలి విషయమై భర్తను గట్టిగా నిలదీయడంతో అసలు నిజం ఒప్పేసుకున్నాడు. అవును.. ప్రియురాలిని కూడా ఊటీకి తీసుకొచ్చానని చెప్పాడు. పైగా,నువ్వంటే నాకిష్టం లేదు,రూ.25లక్షలు కట్నం తీసుకొస్తేనే నీతో కాపురం చేస్తాను అని తేల్చి చెప్పాడు. దీంతో షాక్ తిన్న భార్య తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంజునాథ్ కోసం గాలిస్తున్నారు.