మూడేళ్ల నుంచి పత్తా లేకుండా పోయిన భర్త.. టిక్టాక్ వీడియోలో చూసి పట్టుకున్న భార్య..
విల్లుపురం : షార్ట్ వీడియో యాప్ టిక్టాక్పై ఎన్నో విమర్శలు, మరెన్నో ఫిర్యాదులు. ఈ యాప్ మోజులో పడి కొందరు ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొందరు హాస్పిటల్ పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో టిక్టాక్ను బ్యాన్ చేయాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపేతై టిక్ టాక్ కారణంగా కొన్ని కుటుంబాలు మళ్లీ ఒక్కటవుతున్నాయి. అందులో పోస్ట్ చేస్తున్న వీడియోలు విడిపోయిన భార్యాభర్తల్ని కలుపుతున్నాయి.
టిక్టాక్ పిచ్చి : బ్రిడ్జిపైకి ఎక్కి.. నదిలోకి దూకి..
మూడేళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లిన భర్త
తమిళనాడు విల్లుపురంకు చెందిన జయప్రద, సురేశ్ దంపతులకు ఇద్దరు పిల్లలు. కృష్ణగిరిలో నివాసముంటున్న సురేశ్ 2016లో ఉద్యోగానికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. భర్త జాడ కోసం అతని స్నేహితులు, బంధువుల వద్ద వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. జయప్రద ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ నమోదుచేశారు. మూడేళ్లు గడిచాయి. అయినా ఇప్పటికీ సురేశ్ జాడ తెలియలేదు.
టిక్టాక్లో వీడియో
ఇదిలా ఉంటే జయప్రద బంధువుల్లో ఒకరు సోషల్ మీడియా యాప్ టిక్టాక్ చూస్తుండగా అందులో ఒక వీడియోలో సురేశ్ను పోలిన వ్యక్తి కనిపించాడు. ఇదే విషయాన్ని వారు జయప్రదకు చెప్పారు. దీంతో ట్రాన్స్ జెండర్తో పాటు ఆ వీడియో ఉన్న వ్యక్తిని చూసిన ఆమె అందులో ఉన్నది తన భర్తే అని నిర్థారించుకుంది. విషయాన్ని విల్లుపురం పోలీసుల దృష్టికి తెచ్చింది. విల్లుపురం ట్రాన్స్ జెండర్ అసోసియేషన్ సాయంతో పోలీసులు హోసూర్లోని ట్రాన్స్ జెండర్తో పాటు సురేశ్ను గుర్తించారు.
కౌన్సిలింగ్తో కథ సుఖాంతం
సురేశ్ను పోలీస్ స్టేషన్కు తరలించి విచారించగా.. కుటుంబ సమస్యల నేపథ్యంలో తాను ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు చెప్పాడు. హోసూరు వెళ్లి ఓ ట్రాక్టర్ కంపెనీలో మెకానిక్గా జీవితం ప్రారంభించానని.. అక్కడ పరిచయమైన ట్రాన్స్జెండర్ కలిసి బతుకుతున్నానని చెప్పారు. ఇదంతా విన్న పోలీసులు సురేశ్, జయప్రదలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. మొత్తమ్మీద తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టిక్టాక్ ఒక కుటుంబం కథను సుఖాంతం చేసింది.