స్మార్ట్ ఫోన్ లాక్ కోడ్: భార్యను చంపించిన భర్త
ఝాన్సీ: స్మార్ట్ ఫోన్ లాక్ కోడ్ చెప్పలేదని కోపం తెచ్చుకున్న భర్త భార్యను హత్య చేసి అడ్డంగా బుక్కయ్యాడు. భార్య హత్య కేసులో భర్తను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ ప్రాంతంలో వినీత్ కుమార్ దివాకర్, పూనమ్ వర్మ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు నాలుగు సంవత్సరాల కుమార్తె ఉంది. ఆగస్టు 29వ తేది రాత్రి ఇంటిలో పూనమ్ వర్మ హత్యకు గురైయ్యింది.
మరసటి రోజు ఆమె కుమార్తె కేకలు వెయ్యడంతో విషయం వెలుగు చూసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పూనమ్ వర్మ హత్యకు గురైన సమయంలో తాను వ్యాపారం నిమిత్తం కాన్పూర్ కు వెళ్లానని వినీత్ కుమార్ దివాకర్ పోలీసులకు చెప్పాడు.
అయితే అతను పదేపదే పొంతనలేకుండా సమాధానాలు ఇవ్వడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వినీత్ కుమార్ దివాకర్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తీశారు. అప్పుడు తన స్నేహితులతో తన భార్య పూనమ్ వర్మను హత్య చేయించానని అంగీకరించాడు.
గత నెల తన భార్య ఓ స్మార్ట్ ఫోన్ తీసుకుందని, దానికి లాక్ కోడ్ పెట్టుకుందని చెప్పాడు. లాక్ కోడ్ చెప్పడానికి ఆమె నిరాకరించిందని, తనను, తన కుమార్తెను నిర్లక్షం చేస్తూ ఎప్పుడూ ఫోన్ చూసుకునేదని వినీత్ కుమార్ చెప్పాడని ఝాన్సీ ఎస్పీ దినేష్ కుమార్ సింగ్ అన్నారు.
తన స్నేహితులు లక్ష్మణ్, కమల్ కు రూ. 80,000 వేలు ఇచ్చి తన భార్య పూనమ్ వర్మను హత్య చెయ్యాలని సూచించానని, తరువాత ఇల్లు లూటీ చేయ్యాలని చెప్పానని వినీత్ కుమార్ అంగీకరించాడని జిల్లా ఎస్పీ దినేష్ కుమార్ సింగ్ వివరించారు.