షాక్: షీనాబోరా హత్యకేసును విచారిస్తున్న పోలీస్ అధికారి భార్య అనుమానాస్పద మరణం
షీనాబోరా హత్యకేసులో విచారణ అధికారి ధ్యానేశ్వర్ గనోర్ భార్య దీపాలి గనోర్ మంగళవారం రాత్రి అనుమానాస్పదస్థితిలో మరణించింది.
ముంబై: షీనాబోరా హత్యకేసులో విచారణ అధికారి ధ్యానేశ్వర్ గనోర్ భార్య దీపాలి గనోర్ మంగళవారం రాత్రి అనుమానాస్పదస్థితిలో మరణించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసును ధ్యానేశ్వర్ గనోర్ విచారిస్తున్నారు. ముంబాయిలోని శాంతాక్రూజ్ ఏరియాలోని ఇంటిలో ధ్యానేశ్వర్ గనోర్ భార్య దీపాలి గనోర్ అనుమానాస్పదస్థితిలో మరణించి ఉంది.
ఇంటికి వచ్చిన ధ్యానేశ్వర్ తన భార్య మరణించి ఉండడాన్ని ఆయన పోలీసులకు సమాచారమిచ్చాడు. ఉదయం పదిన్నరగంటల సమయంలో ఇంటికి వచ్చి తలుపులు కొట్టినా భార్య ఎంతకు తలుపులు తీయలేదు. ఫోన్ చేసినా ఫలితం లేకుండాపోయిందని పోలీసులు తెలిపారు.
ఏదోరకంగా తలుపులు తెరిచిచూస్తే రక్తపు మడుగులో ఉన్న తన భార్య మృతదేహం కన్పించిందని ధ్యానేశ్వర్ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు ఈ సంఘటన జరిగిన నాటి నుండి కూడ తన కొడుకు కూడ కన్పించకుండాపోయాడని ఆయన చెబుతున్నారు.
అంతేకాదు తన కొడుకు సెల్ ఫోన్ కూడ స్విఛ్చాప్ లో ఉందన్నారు.సంఘటన స్థలంలో హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.