నా భార్య చీర ధరిస్తుంది, ఎవరూ ఛిడాయించలేదు: గోవా మంత్రి
పానాజీ: గోవా కర్మాగారాల మంత్రి దీపక్ ధావలికర్ ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. తన భార్యను సమర్థిస్తూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్య వస్త్రధారణ వల్లనే మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆమె అన్నారు. దాన్ని సమర్థిస్తూ మంత్రి - తన భార్య చీర మాత్రమే ధరిస్తుందని, ఆమెకు అల్లరి మూకల నుంచి వేధింపులు ఏనాడూ లేవని ఆయన అన్నారు.
నేడు మహిళలు ధరిస్తున్న దుస్తుల కారణంగానే అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. మహిళలు హిందూ సంస్కృతిని పాటిస్తే అత్యాచారాల సంఘటనలు జరగవని ఆయన అన్నారు. ప్రవర్తనలో, వస్త్రధారణలో ప్రజలు మారిపోయారని, దాంతో అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు.
పిల్లలను మిషనరీ స్కూల్లో చేర్చవద్దని వివాదాస్పద మితవాద విభాగం కార్యకర్త లత ఆదివారం ఓ సదస్సులో అన్నారు. మహిళలు పాశ్చాత్య సంస్కృతిని పాటించడం వల్ల అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆమె మార్గావ్లో జరిగిన సదస్సులో అన్నారు.
తన భార్య చెప్పిన మాటల్లో నిజం ఉందని అంటూ కాన్వెంట్ స్కూళ్లు మన సంస్కృతి గురించి చెబుతున్నాయా అని ఆయన అడిగారు. ఆ పాఠశాలల్లో చదువుతున్నవారికి మన సంస్కృతి పట్ల ఏ విధమైన అవగాహన కూడా లేదని అన్నారు.
తన భార్య తన జీవిత కాలంలో కుంకుమ, చీర ధరిస్తుందని, ఆమెపై ఈవ్ టీజింగ్ ఏనాడూ జరగలేదని అన్నారు. ప్రజలకు ఆమె అది వివరించాల్సి ఉండిందని ఆయన అన్నారు. హిందూ మతం గురించి తన భార్య బోదనలు చేసిందని, హృదయం నుంచి వచ్చే భావనలను వ్యక్తం చేయడంలో తప్పు లేదని ఆయన అన్నారు.