అట్లాస్ సైకిల్ తయారీ సంస్థ యజమాని భార్య ఆత్మహత్య..
ప్రముఖ సైకిల్ తయారీ సంస్థ అట్లాస్ యజమాని సంజయ్ కపూర్ భార్య నటాషా కపూర్(58) ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీలోని ఔరంగజేబు రోడ్లో ఉన్న ఆమె నివాసంలో మంగళవారం సాయంత్రం పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఆమె ఉరి వేసుకుని చనిపోయినట్టు గుర్తించారు. నటాషా ఆత్మహత్య చేసుకున్న గదిలో పోలీసులకు సూసైడ్ లభ్యమైంది. 'నేను నా కుటుంబ సభ్యులను ప్రేమిస్తున్నాను' అని అందులో ఆమె పేర్కొన్నారు. నటాషా మృతిపై పోలీసులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గంగారామ్ ఆస్పత్రికి తరలించారు.
ఆమె మృతదేహాన్ని గుర్తించిన భవనానికి బిషంబెర్ దాస్ కపూర్,జైదేవ్ కపూర్,జగదీష్ కపూర్ అనే నేమ్ ప్లేట్స్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆమె తన కుమారుడు సిద్దాంత కపూర్తో నివసిస్తున్నట్టు సమాచారం. మధ్యాహ్నం లంచ్ సమయం నుంచే నటాషా కనిపించట్లేదని తెలుస్తోంది. ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం కలిగినట్టు సమాచారం. కుమారుడు సిద్దాంత కపూర్ ఆమె గదిలోకి వెళ్లి చూడగా.. సీలింగ్కు వేలాడుతూ కనిపించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేరగా.. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గంగారామ్ ఆస్పత్రికి తరలించారు.అక్కడ దొరికిన పలు ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు.
కాగా, ప్రముఖ సైకిల్ తయారీ సంస్థ అట్లాస్ను జగదీష్ కపూర్ 1951లో స్థాపించారు. . తొలి ఏడాదిలోనే 12వేల సైకిళ్లను తయారు చేశారు. 1958లో విదేశాలకు సైకిళ్ల ఎగుమతి ప్రారంభించారు. 1978లో తొలిసారి రేసింగ్ సైకిల్ను కూడా పరిచయం చేశారు. జగదీష్ కపూర్ జనవరి 5,2003న మరణించారు. ఆయన మరణానంతరం సంజయ్ కపూర్ ఆ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.