ప్రియునితో కలిసి భర్తను నదిలో తోసేసి చంపింది
బెంగళూరు: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా కర్నాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. తన ప్రియునితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన బెంగళూరులో సంచలనం సృష్టించింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కూలీ పని చేసుకుంటూ జీవించే రూపవతి, సురేష్లు ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారుమదనయకనహళ్లిలోని సిద్ధహోషళ్లి తంకూర్ రోడ్లో నివాసం ఉంటున్నారు. తన భర్త స్నేహితుడు రవి తరచూ ఇంటికి వస్తూ ఉండేవాడు. కాగా రవితో రూపవతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో సురేష్ను హత్య చేయాలని రూపవతి, రవి ప్రణాళిక రచించుకున్నారు.
ఇందులో భాగంగానే సెప్టెంబర్ 11న హస్సన్ జిల్లా హొళ్లేసరసిపుర తాలూకాలోని హేమవతి నది తీరాన గల ఆలయానికి తన భర్త సురేష్ను తీసుకుని వచ్చింది రూపవతి. రూపవతి చెప్పిన విధంగా రవి కూడా అక్కడికి చేరుకున్నాడు. స్నానం చేయడానికి వెళ్లిన సురేష్ను రూపవతి, రవి కలిసి నదిలో తోసేశారు. తనపై అనుమనం రాకుండా రెండు రోజుల తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ రూపవతి స్థానిక పోలీస్ స్టేషన్లోఫిర్యాదు చేసింది.
సెప్టెంబర్ 14న సురేష్ మృతదేహాన్ని మాండ్యా జిల్లాలో పోలీసులు గుర్తించారు. అనంతరం విచారణ ప్రారంభించిన పోలీసులు రూపవతి, రవికి సంబంధించిన ఫోన్ సంభాషణలను పరిశీలించారు. నిందితులుగా తేలడంతో రవి, రూపవతిలను పోలీసులు అరెస్ట్ చేశారు.