ఎగ్ కర్రీ వండేందుకు భార్య నిరాకరించిందని.. భర్త దారుణానికి కొడుకు బలి..
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. భార్య ఎగ్ కర్రీ వండేందుకు నిరాకరించిందని ఓ భర్త ఆమెతో పాటు కొడుకుపై దాడి చేశాడు. దాడిలో తీవ్ర గాయాలపాలైన కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బులంద్ షహర్లోని నగ్లా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బులంద్షహర్ జిల్లాలోని నగ్లా గ్రామానికి చెందిన సుభాష్ బంజరా మద్యానికి బానిసయ్యాడు. లాక్ డౌన్ కారణంగా మద్యం దొరక్క ఉక్కిరిబిక్కిరి అయిన బంజారా.. మద్యం షాపులు తెరిచినప్పటి నుంచి రోజూ తాగుతున్నాడు. ఇదే క్రమంలో శనివారం రాత్రి కూడా పీకల్లోతు మద్యం సేవించి ఇంటికొచ్చాడు. భార్యను ఎగ్ కర్రీ చేయమని కోరాడు.
అయితే అందుకు భార్య నిరాకరించడంతో తీవ్ర కోపోద్రిక్తుడై ఆమెపై దాడి చేశాడు. అనంతరం కొడుకు(3)పై కూడా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ.. పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత బంజారా ఇంటి నుంచి పారిపోయినట్టు స్థానిక సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఘటనపై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎగ్ కర్రీ వండలేదన్న చిన్న కారణానికే భార్య,కొడుకుపై బంజారా దాడి చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.