బాత్రూమ్ గొడవ.. భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త...
ఇదో విచిత్ర ఘటన. మొగుడు-పెళ్లాం అన్నాక గొడవపడటం.. మళ్లీ వెంటనే కలిసిపోవడం సహజం. ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకుపోతేనే గొడవలు సద్దుమణుగుతాయి. అలా కాకుండా చిన్న చిన్న కారణాలకే రచ్చకెక్కితే కాపురాలు కూలిపోతాయి. ఇలాంటిదే గుజరాత్లో ఓ సంఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్కి చెందిన సబ్బీర్ గాంధీ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం జూలీ అనే మహిళతో వివాహమైంది. గాంధీ ట్రావెల్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఓరోజు ఆఫీసుకు తయారవుతుండగా.. అతని భార్య బెడ్రూమ్లోకి వచ్చింది.
నీ బాత్రూమ్ వాడుకుంటానని ఆమె చెప్పడంతో.. అందుకు అతను నిరాకరించాడు. నీ బెడ్రూమ్లో కూడా బాత్ రూమ్ ఉంది కదా అని వాదించాడు. దాంతో ఆమె అతన్ని బండ బూతులు తిట్టింది. కేసు పెట్టి బుక్ చేస్తానని హెచ్చరించింది. దీంతో భయపడ్డ గాంధీ స్థానిక పోలీసులను ఆశ్రయించి భార్యపై ఫిర్యాదు చేశాడు.
తన బాత్రూమ్ వాడవద్దని హెచ్చరించినందుకు భార్య తనను తిట్టిందని... తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. గాంధీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.