వికిలీక్స్ సంచలనం?: సీఐఏ చేతిలోకి ఆధార్ డేటా, ఆ సంస్థ వల్లే!
యూఐడీఏకు బయోమెట్రిక్ సొల్యూషన్స్ అందిస్తున్న క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుగా చెబుతున్నారు.
న్యూఢిల్లీ: వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా పరిగణించాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన రెండు రోజులకే.. భారీ మొత్తంలో ఆధార్ డేటా చోరీకి గురవడం కలకలం రేపుతోంది.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏ)కు బయోమెట్రిక్ సొల్యూషన్స్ అందిస్తున్న క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్ సహకారంతో.. సీఐఏ(సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ)కు చెందిన ఆఫీస్ ఆఫ్ టెక్నికల్ సర్వీసెస్(ఓటీఎస్) ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు వికీలీక్స్ వెల్లడించింది.
క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్ డెవలప్ చేసిన టూల్స్ ద్వారా సీఐఏ ఈ డేటాను చోరీ చేసినట్లుగా వికీలీక్స్ తెలిపింది. ఇదే నిజమైతే దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది పౌరుల వ్యక్తిగత వివరాలు సీఐఏ చేతిలోకి వెళ్లినట్లే. అయితే వికీలీక్స్ వెల్లడించిన ఈ విషయాలను అధికారులు మాత్రం ఖండించారు.
వికీలీక్స్ ట్వీట్లపై స్పందించిన అధికారులు ఆధార్ కార్డుల సమాచారం తస్కరణకు గురైందనే మాట అవాస్తవమని అన్నారు. వికీలీక్్ అసలు అలాంటి పోస్టులు చేయలేదని, ఓ గుర్తు తెలియని వెబ్ సైట్లో మాత్రమే ఈ రిపోర్టు వచ్చిందని పేర్కొన్నారు.
క్రాస్ మ్యాచ్ సంస్థ కేవలం బయోమెట్రిక్ పరికరాలను సరఫరా చేసే సంస్తనే తప్ప వేరే విషయాలతో దానికి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ఆధార్ డేటాను పూర్తిగా ఎన్క్రిప్ట్ చేశామని, యూఐడీఎఐ తప్ప ఇతర ఏజెన్సీ ఏది దాన్ని డీక్రిప్ట్ చేయలేదని వెల్లడించారు.