ఇక టీఎంసీలో మమత ఒక్కరే! వామపక్షాల కంటే దారుణమంటూ అమిత్ షా తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ/కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ టీఎంసీ, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. టీఎంసీ నేతలు బీజేపీలో చేరడానికి మమత ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు.
అల్లుడి కోసమే మమత పనిచేస్తున్నారు..
హౌరాలో జరిగిన పార్టీ బహిరంగ సభలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వామపక్షాల కంటే దారుణ పాలన కొనసాగుతోందని అమిత్ షా విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజాశ్రేయస్సు కోసం పనిచేస్తుంటే.. మమత మాత్రం తన అల్లుడి కోసం మాత్రమే పనిచేస్తున్నారని దుయ్యబట్టారు.
టీఎంసీలో మమతా బెనర్జీ ఒక్కరే మిగులుతారు
ఎన్నికల సమయం నాటికి దీదీ వైపు ఏ ఒక్కరూ మిగలర్నారు అమిత్ షా. ఇప్పటికే అధికార టీఎంసీకి చెందిన కీలక నేతలు బీజేపీలో చేరగా.. మరికొందరు కూడా అదే బాటలో నడుస్తారని ఆయన సంకేతాలిచ్చారు. మమత బెనర్జీ తన సర్కారు పనితీరుపై ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో దోపిడీ, అవినీతి పాలన కొనసాగుతోందని విమర్శించారు.
కరోనా సమయంలో మమత సర్కారు దోపిడీ..
వచ్చే ఎన్నికల్లో బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. లాక్డౌన్ సమయంలో దేశంలో దాదాపు 80 కోట్ల మంది ప్రజలకు ఐదు కిలోల బియ్యం, కిలో పప్పును 8 నెలలపాటు కేంద్ర ప్రభుత్వం అందించినట్లు మరో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ అన్నారు. బెంగాల్లో మాత్రం మమత సర్కారు వాటన్నింటినీ లూటీ చేసిందని ఆరోపించారు. దేశంలో వలస కార్మికుల కోసం దాదాపు 50 కోట్ల పనిరోజులను కల్పిస్తే.. టీఎంసీ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించిందని ధ్వజమెత్తారు.
Recommended Video
బీజేపీలోకి టీఎంసీ నేతల వలసలు..
కాగా, టీఎంసీని వీడిన మాజీ మంత్రి రాజీబ్ బెనర్జీ, ఎమ్మెల్యేలు ప్రబీర్ ఘోషల్, బైశాలి దాల్మియా, హౌరా మాజీ మేయర్ రతిన్ చక్రవర్తి శనివారం అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. మరికొందరు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, పార్టీని వీడినవారి గురించి తమకు ఎలాంటి సమస్య లేదని, ఇంకెవరైనా పార్టీని వీడాలనుకుంటే వీడిపోవచ్చని ఇటీవల మమతా బెనర్జీ స్పష్టం చేశారు.