జెడి(ఎస్)కు షాక్: రేవణ్ణకు బిజెపి ఆఫర్, మూడుముక్కలాట?
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు క్షణక్షణానికి మారుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో జెడి(ఎస్) కు కాంగ్రెస్ పార్టీ మద్దతును ఇచ్చేందుకు సిద్దమైంది. ఈ తరుణంలో జెడి(ఎస్) చీఫ్ దేవేగౌడ పెద్ద కొడుకు రేవణ్ణ నేతృత్వంలోని 12 మంది జెడి(ఎస్) ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని ప్రకటించడం సంచలనంగా మారింది.
Recommended Video
కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కాకుండా అడ్డుకొనేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు జెడి(ఎస్)ను దెబ్బకొట్టేందుకు బిజెపి పావులు కదుపుతోంది. జెడి(ఎస్) చీఫ్ దేవేగౌడ పెద్ద కొడుకు రేవణ్ణతో పాటు మరో 12 మంది ఎమ్మెల్యేలు బిజెపికి మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉన్నారని గవర్నర్ కు బిజెపి నేత , మాజీ సీఎం యడ్యూరప్ప ప్రకటించడం సంచలనంగా మారింది.
కర్ణాటకలో కింగ్ మేకర్ గా మారిన జెడి(ఎస్)ను చిత్తు చేసేందుకు బిజెపి వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. జేడీఎస్ గెలిచిన స్థానాలు కాంగ్రెస్, బీజేపీతో పోల్చుకుంటే తక్కువే. కానీ, ప్రభుత్వ ఏర్పాటులో జెడి(ఎస్) నిర్ణయాత్మక శక్తిగా మారడంతో అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ఈ రెండు పార్టీలు జేడీఎస్ను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది.
కాంగ్రెస్ ఇప్పటికే సీఎం పదవిని కూడా జేడీఎస్కు ఆఫర్ చేసింది. ఈ ఆఫర్కు కుమారస్వామి కూడా ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో జేడీఎస్ను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ కుమారస్వామికి సీఎం పదవి ఆఫర్ చేస్తే.. బీజేపీ మాత్రం దేవెగౌడ పెద్ద కొడుకు రేవణ్ణకు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేసింది. రేవణ్ణకు 12మంది జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో ఆయన అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఎమ్మెల్యేలు కూడా దేవెగౌడ, కుమారస్వామి, రేవణ్ణ వర్గాలుగా చీలిపోయినట్లు సమాచారం. అయితే పార్టీలో ఏర్పడిన ఈ చీలికను అడ్డుకునేందుకు కుమారస్వామి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.