సోనియాకు షాకిచ్చిన మమత..రెండు నాలుకల వాళ్లతో కలవబోనన్న బెంగాల్ సీఎం.. భేటీపై ఉత్కంఠ
ఒకవైపు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మైనార్టీల నిరసనలు.. ఇంకోవైపు జేఎన్యూ హింసపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు.. మరోవైపు మోడీ సర్కార్ విధానాలను వ్యతిరేకంగా కార్మిక, ఉద్యోగ సంఘాల ధర్నాలు.. దేశంలో ఎటుచూసినా టెన్షన్ వాతావరణం.. ఇలాంటి కీలక సమయంలో తాము చేయాల్సిన పనేంటో, అనుసరించాల్సిన వ్యూహాలేంటో చర్చించడానికి దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ సమావేశం కానున్నాయి. అయితే ఈ భేటీని తాను బాయికాట్ చేస్తున్నట్లు టీఎంసీ చీఫ్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించడం సంచలనంగా మారింది.
సారీ సోనియా..
ఈనెల 13న ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల భేటీ జరుగనుంది. కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ ఆహ్వానం మేరకు ఈ మీటింగ్ ఏర్పాటైంది. మొన్నటి భారత్ బంద్ లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల యూనియన్ నేతలపై పోలీసుల దమనకాండ, విద్యార్థి ఉద్యమాలు, సీఏఏ నిరసనలు తదితర అంశాలను చర్చించనున్న నేతలు.. మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ఉమ్మడిగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశముంది. ఈ మేరకు మమతా బెనర్జీకి కూడా ఆహ్వానం వచ్చినా, తాను మీటింగ్ కు పోనని ఆమె చెప్పారు.
చస్తే లెఫ్ట్ తో కలవను..
వెస్ట్ బెంగాల్ లో తన ప్రత్యర్థులైన లెఫ్ట్ పార్టీలతో ఎట్టిపరిస్థితుల్లోనూ వేదిక పంచుకోబోనని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. టీఎంసీని నేరుగా ఎదుర్కొనే దమ్ములేక సీపీఎం, సీపీఐలు బీజేపీతో చేతులు కలిపాయని, రాష్ట్రంలో బీజేపీ బలపడటానికి ముమ్మాటికీ లెఫ్ట్ పార్టీలే కారణమని మమత చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. సోనియాతో మీటింగ్ ను బహిష్కరించడానికి ఇంకో బలమైన కారణం కూడా మమత వెల్లడించారు..
రెండు పార్టీలపై దీదీ ఫైర్
బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా కార్మిక, ఉద్యోగ సంఘాలు బుధవారం చేపట్టిన భారత్ బంద్ కు మద్దతు ఇవ్వకపోగా, సమ్మెలో పాల్గొంటే చర్యలు తప్పదని బెంగాల్ సీఎం మమత వార్నింగ్ ఇచ్చారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో బంద్ ప్రశాంతంగా సాగినా, వెస్ట్ బెంగాల్ లో మాత్రం హింసాయుతంగా మారింది. పలు చోట్ల ఆస్తుల ధ్వంసం జరిగింది. బెంగాల్ లో హింసకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలే బాధ్యత వహించాలని మమత అంటున్నారు.
ఎన్ని పార్టీలు వస్తాయో?
ఒక చోట హింసను ప్రోత్సహించి, మరోచోట అహింస గురించి మాట్లాడుతూ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని, రెండు నాలుకల వ్యక్తులతో తాను కలవబోనని మమత బెనర్జీ చెప్పారు. ప్రతిపక్ష పార్టీల్లో ముఖ్యురాలైన మమతే గైర్హాజరవుతుండటం, ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ కూడా డుమ్మాకొట్టే అవకాశాలుండటంతో అసలు మీటింగ్ కు ఎన్ని పార్టీలు వస్తాయనేదానిపై ఉత్కంఠ నెలకొంది.