వాజ్పేయి బాటలో యడ్యూరప్ప?: విశ్వాస పరీక్షకు ముందు అదే జరగబోతుందా?
బెంగళూరు: విశ్వాస పరీక్షకు సమయం దగ్గరపడుతున్న కొద్ది కర్ణాటక రాజకీయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విశ్వాసంలో నెగ్గేందుకు అస్త్ర శస్త్రాలు సంధించిన సీఎం యడ్యూరప్ప.. రాజీనామా చేయబోతున్నారంటూ వదంతులు రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇదే గనుక జరిగితే.. 1996లో నాటి ప్రధాని వాజ్పేయి ఏదైతే చేశారో యడ్యూరప్ప కూడా అదే చేయబోతున్నారని ఊహించవచ్చు. 1996లో మొదటిసారి ప్రధాని అయిన వాజ్ పేయి కేవలం 13రోజులు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. కావాల్సిన మెజారిటీ లేకపోవడంతో విశ్వాస పరీక్ష రోజు.. బలనిరూపణకు కొద్ది సమయం ముందు ఆయన రాజీనామా చేశారు.
ఆ సమయంలో వాజ్పేయి చేసిన ప్రసంగం చాలామందిని ఉద్విగ్నతకు లోను చేసింది. బీజేపీయేతర పార్టీల్లోనూ ఆయనపై సానుభూతి కలిగేలా చేసింది. సరిగ్గా యడ్యూరప్ప కూడా ఇప్పుడు అదే పనిచేయబోతున్నారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. మెజారిటీ సభ్యుల మద్దతు దక్కని పక్షంలో... విశ్వాస పరీక్షకు ముందే రాజీనామా సమర్పించి భావోద్వేగ ప్రసంగం చేస్తారా? అన్న చర్చ జరుగుతోంది.
విశ్వాస పరీక్ష సమయంలో దేశమంతా ఆ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది కాబట్టి.. యడ్యూరప్ప తన భావోద్వేగ ప్రసంగం ద్వారా సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తారేమో అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. తద్వారా కర్ణాటక ప్రజల్లోనూ బీజేపీ పట్ల మరింత అనుకూలతను కూడగట్టవచ్చునని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే యడ్యూరప్ప నిజంగా వాజ్పేయి తరహాలో అంత నైతికతను ప్రదర్శిస్తారా? అంటే.. ఏది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. సీఎం పీఠాన్ని వదులుకోవడానికి ఏమాత్రం సిద్దంగా లేని ఆయన.. ఎలాగైనా విశ్వాస పరీక్షలో నెగ్గడానికే ప్రయత్నిస్తారన్న వాదన కూడా వినిపిస్తోంది. మొత్తం మీద ఈ సాయంత్రం 4గం. తర్వాత కర్ణాటకలో ఏం జరగబోతుందన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.