రామ మందిరంపై బీజేపీ నేతలు మాట్లాడటం ఆపండి: అయోధ్యలో ఆలయాన్ని మేమే నిర్మిస్తాం
న్యూఢిల్లీ: రాజకీయనాయకుల సహాయం లేకుండా అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తామని హిందూ మత పెద్దలు పేర్కొన్నారు. రాజ్యసభలో మెజారిటీ లేకుండా, అయోధ్యలో రామలయాన్ని నిర్మాణానికి చట్టం తీసుకురావడం అసాధ్యమని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన నేపథ్యంలో పై విధంగా స్పందించారు.
ద్వారకాపీఠ శంకరాచార్యులు సద్గురు స్వరూపానంద సరస్వతి మాట్లాడుతూ బేజీపీ నేతలు రామాలయం నిర్మాణం గురించి మాట్లాడటం ఇకనైనా ఆపాలని సూచించారు. సుప్రీం కోర్టు తమకు అనుకూలంగా తీర్పునిస్తే, రాజకీయ నాయకుల సహాయం లేకుండా రామాలయాన్ని తామే నిర్మిస్తామని తేల్చి చెప్పారు.
హిందూ ధర్మ సంసద్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. రామమందిరాన్ని నిర్మాణానికి కూడా రాజకీయ నేతల డబ్బు అవసరం లేదన్నారు.
ప్రజలే డబ్బు ఇస్తారని చెప్పారు. మేమే రామలయాన్ని నిర్మిస్తామన్నారు, మమ్మల్ని క్షమించండి. ఇంతటితో రామాలయం నిర్మాణం గురించి మాట్లాడకండని సూచించారు. దీనికి సంబంధించి సంసద్ ఆధ్వర్యంలో ఓ తీర్మానాన్ని చేశారు.
దీంతో పాటు విదేశాలకు ఆవు మాంసం ఎగుమతిని నిషేధించడం, రామాయణ, మహాభారతం గురించి రాబోయే తరాలకు అవగాహాన కల్పించడం కోసం విద్యాసంస్ధల్లో జ్ఞానం అందించడంతో పాటు ఆల్కహాల్ని నిషేధించడం లాంటి వాటిపై కూడా తీర్మానాలు చేశారు.
రామ్ లీలా మైదానంలో జరిగిన ఈ హిందూ ధర్మ సంసద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ హిందూ మత సంస్ధలు పాల్గొన్నాయి.