మోడీ, యోగిని విమర్శిస్తే.. సజీవ సమాధే: మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
అలీగఢ్: ఉత్తరప్రదేశ్ మంత్రి రఘురాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి వ్యతిరేకంగా ఎవరైనా నినాదాలు చేస్తే వారిని సజీవంగా సమాధి చేస్తానని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) 2019కు మద్దతుగా ఆదివారం అలీగఢ్లో జరిగిన ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు సదరు మంత్రి.
మోడీ, యోగిని విమర్శిస్తే.. సజీవ సమాధే
‘ప్రధాని నరేంద్ర మోడీ లేదా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు వ్యతిరేకంగా ఎవరైనా నినాదాలు చేస్తే వారిని సజీవంగా మట్టిలో పూడ్చిపెడతా' అంటూ మంత్రి రఘురాజ్ సింగ్ బెదిరింపులకు పాల్పడ్డారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులు ఇటీవల సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ.. ప్రధాని, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
సీఏఏను వ్యతిరేకించేది 1శాతం ప్రజలే..
‘సీఏఏను కేవలం 1శాతం మంది ప్రజలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. వారంతా ఇండియాలోను ఉంటూ, ఇక్కడే మన పన్నులతో వచ్చిన ఆదాయంతో తింటూ.. మన నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ దేశం అన్ని వర్గాల ప్రజలకు చెందినదని.. అయితే, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే అంగీకరించం' అని మంత్రి రఘురాజ్ స్పష్టం చేశారు.
నెహ్రూపైనా మంత్రి విమర్శలు..
మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపైనా ఈ మంత్రి విమర్శలు గుప్పించారు. నెహ్రూ కులం ఎంటి? అని ప్రశ్నించారు. అతనికి ఓ ‘ఖందాన్' అంటూ లేదని విమర్శించారు. కాగా, రఘురాజ్ సింగ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ కార్మికశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఇటీవల పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసనలు చేసిన విషయం తెలిసిందే.
పలువురు విధ్యార్థులు విధ్వంసానికి కూడా పాల్పడ్డారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. విద్యార్థులపై లాఠీఛార్జీ చేయడం సరికాదంటూ వ్యాఖ్యానించాయి. వర్సిటీలోకి పోలీసులు ఎలా వెళ్లారంటూ ప్రశ్నించాయి. కాగా, పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ సీఏఏను అమలు చేస్తూ జనవరి 10న కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.