సీఏఏని వ్యతిరేకిస్తారా.. ప్రాణం ఉండగానే పాతిపెట్టేస్తా.. : బీజేపీ నేత హెచ్చరిక
జాతీయ పౌరసత్వ పట్టిక(NRC),పౌరసత్వ సవరణ చట్టం(CAA)లకు వ్యతిరేకంగా ఓవైపు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ చట్టాల అమలుపై వెనక్కి తగ్గేది లేదని చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నవారిపై బీజేపీ నేతలు హెచ్చరిక స్వరంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం. తాజాగా ఉత్తరప్రదేశ్ మంత్రి,బీజేపీ నేత రఘురాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సీఏఏకి మద్దతుగా ఆదివారం ఏర్పాటు చేసిన ఓ సభలో మంత్రి ప్రసంగించారు.
పౌరసత్వ చట్టాలకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ,ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లను విమర్శిస్తున్నవారిని సజీవంగా పాతిపెడుతానని రఘురాజ్ సింగ్ హెచ్చరించారు. 'యూనివర్సిటీ కోసం ప్రభుత్వం ఇచ్చే ట్యాక్స్ డబ్బులను ఉపయోగించుకుని... సీఎం యోగి ఆదిత్యనాథ్,ప్రధాని మోదీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తారా..? మిమ్మల్ని బతికుండగానే పాతిపెడుతా..' అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
దేశంలో నివసించే హక్కు ప్రజలకు ఉందని.. అయితే భారత్ ధర్మ సత్రం ఏమీ కాదని అన్నారు. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీని అమలుచేసి తీరుతామన్నారు. 'అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలోని ముస్లిం విద్యార్థులు శాంతి కాముకులు,ప్రేమించే గుణం కలవారు. కానీ మీరు అధికారులను,ముస్లిం సోదరులను ఘెరావ్ చేస్తే మాత్రం మీపై దాడి చేస్తాం. మిమ్మల్ని వదిలిపెట్టం.' అని రఘురాజ్ సింగ్ హెచ్చరించారు.
సీఏఏ ఆందోళనల్లో చెలరేగిన అల్లర్ల గురించి మాట్లాడిన ఆయన.. క్రిమినల్ మైండ్సెట్ కలిగినవారు ఒక్క శాతం కంటే తక్కువ ఉన్నారని చెప్పారు. 'ఒకవేళ భారత్పై పాకిస్తాన్.. తన కళ్లు ఎగిరేసినంత పనిచేస్తే.. ప్రపంచ పటంలో దానికి స్థానం కూడా ఉండదు. ఒకవేళ మధ్యలో చైనా తలదూర్చితే.. దాని బుల్లెట్లకు బుల్లెట్లతోనే సమాధానం చెబుతాం. మోదీ ఎవరికీ భయపడే రకం కాదు.' అని రఘురాజ్ సింగ్ చెప్పుకొచ్చారు.
కాగా,పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుచేసి తీరుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. గతేడాది డిసెంబర్ 11న సీఏఏకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్లో మతపరమైన అణిచివేతను ఎదుర్కొని 2014 డిసెంబర్ 31 నాటికి భారత్కు వలసొచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతాలకు చెందిన వారికి భారత పౌరసత్వం కల్పిస్తామని ఈ చట్టంలో పేర్కొన్నారు. అయితే మతం ఆధారంగా పౌరసత్వాన్ని కల్పించడం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్దమని ప్రతిపక్షాలు,మేదావులు వాదిస్తున్నారు. చట్టంలో ముస్లింలకు స్థానం కల్పించకపోవడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి.