అధికారం పోయే.. ఆడియో టేపుల్లో దొరికే! ఇక కేసులు వెంటాడుతాయా?
బెంగళూరు: మే 15న మొదలైన ఉత్కంఠకు ఎట్టకేలకు ఈ సాయంత్రం తెరపడింది. యడ్యూరప్ప రాజీనామాతో కర్ణాటకలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, జేడీఎస్ ఫైట్ ముగిసిపోయింది. అంతిమంగా కాంగ్రెస్, జేడీఎస్ తమ పట్టు నిలుపుకోగా.. తమకంత బలం లేదంటూ బీజేపీ చేతులెత్తేసింది.
నిజానికి కాంగ్రెస్ గనుక అర్థరాత్రి సుప్రీం తలుపు తట్టి బలనిరూపణ గడువును సవాల్ చేసి ఉండకపోతే పరిస్థితి మరోలా ఉండేదేమో!. దీంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి డబ్బు ఉన్నా.. బీజేపీ వద్ద అంత సమయం మాత్రం లేకుండా పోయింది. అప్పటికీ బీజేపీ చాలానే ప్రయత్నాలు సాగించినప్పటికీ ఫలితం మాత్రం దక్కలేదు.
సరికదా! బేరసారాల ఆడియో టేపులు లీకై బద్నాం కావాల్సిన పరిస్థితి తలెత్తింది. యడ్యూరప్ప రాజీనామాతో ఇక రేపో మాపో జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ వెంటనే బీజేపీ బేరసారాలపై ప్రభుత్వం కేసులు నమోదు చేయించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఓ కేసు కూడా నమోదైన సంగతి తెలిసిందే.
తొలుత మైనింగ్ కింగ్, మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి రాయచూర్ ఎమ్మెల్యే బసవనగౌడకు భారీ ఎత్తున డబ్బు ఆఫర్ చేసిన ఆడియో టేపు బయటకొచ్చింది. ఆ తర్వాత యడ్యూరప్ప కొడుకు రూ.5కోట్లతో తమ ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టాడంటూ మరో ఆడియో టేపును కాంగ్రెస్ లీక్ చేసింది. ఇక మూడోసారి ఏకంగా యడ్యూరప్ప బేరసారాల ఆడియోను లీక్ చేసి పెద్దం సంచలనమే సృష్టించింది.
ఇక కుమారస్వామి అధికారంలోకి రావడం లాంఛనమే కాబట్టి.. బీజేపీ మీద బేరసారాల కేసులు కూడా లాంఛనమే అన్న వాదన వినిపిస్తోంది. యడ్యూరప్ప, జనార్దన్ రెడ్డి, యడ్యూరప్ప కొడుకు కచ్చితంగా కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇంకా బయటపెట్టని ఆధారాలేమైనా కాంగ్రెస్ వద్ద ఉన్నాయా? అన్నది కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. ఉంటే గనుక.. మరింత మంది బీజేపీ నేతలు కేసుల్లో ఇరుక్కోక తప్పదు.
మొత్తం మీద అధికార పీఠాన్ని కొద్దిలో కోల్పోయి.. గవర్నర్ ను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. బలనిరూపణ ముందు బీజేపీ బలం వీగిపోక తప్పలేదు. ఆ పార్టీ ప్రయోగించిన అస్త్ర శస్త్రాలన్ని విఫలమై.. బేరసారాల ఆడియో టేపుల్లో దొరికిపోయి.. చివరికిప్పుడు కేసులను ఎదుర్కోక తప్పని పరిస్థితి.