మూకదాడుల నియంత్రణకు చట్టాన్ని మారుస్తాం: అమిత్ షా
న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న మూక దాడులను నియంత్రించేందుకు చట్టాన్ని మార్చాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఇప్పటికే దీనిపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లేఖలు కూడా రాసినట్లు బుధవారం ఆయన రాజ్యసభలో వెల్లడించారు.
సీఆర్పీసీ, ఐపీసీలలో అవసరమైన మామర్పులు చేసేలా కమిటీని కూడా ఏర్పాటు చేశామని అమిత్ షా తెలిపారు. ఆ కమిటీ సలహాలను అధ్యయనం చేసి చట్టంలో మార్పులు చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
ఇటీవల విడుదల చేసిన జాతీయ నేర గణాంకాల బ్యూరో(ఎన్సీఆర్బీ) నివేదికలో మూక దాడుల మరణాలను పేర్కొనకపోవడానికి గల కారణాలను కేంద్ర వివరించింది. అనేక నేరాలకు భారతీయ శిక్షాస్మృతిలో స్పష్టమైన నిర్వచనాలు ఉన్నాయని తెలిపింది.
కానీ, మూకదాడుల్లో మరణాలకు సంబంధించిన సమాచారం నమ్మదగినది కాదనీ, ఈ మరణాలు ఎవరు చేశారన్న అంశంపై స్పష్టం లేదని తెలిపారు. అందుకే తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందనిపేర్కొంది. ఈ కారణంగానే అలాంటి నమ్మదగని సమాచారాన్ని ఎన్సీఆర్బీ నివేదికలో ప్రచురించడం సరికాదని అభిప్రాయపడినట్లు తెలిపింది.
పార్లమెంటు ముందు మూకదాడుల వివరాలు పెట్టకపోవడంపై వివరణ ఇస్తూ కేంద్రం ఈ మేరకు వివరణ ఇచ్చింది. రాజ్యసభలో కొందరు సభ్యులు మూకదాడుల విషయంలో కమ్యూనిటీల పేర్లు తీసుకురావడంపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చర్యలు తగదని అన్నారు.