చిరంజీవి కర్నాటకలో దిగ్గజాలను ఢీకొంటారా? (పిక్చర్స్)
బెంగళూరు: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి రానున్న సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రం మారనున్నారా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. చిరంజీవి రానున్న ఎన్నికల్లో చిక్ బళ్లాపూర్ నుండి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చిక్ బళ్లాపూర్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్రమంత్రి వీర ప్ప మొయిలీ పేరు కాంగ్రెస్ తొలి జాబితాలో లేకపోవడంతో అక్కడ అనేక ఊహాగానాలు వస్తున్నాయి.
జాబితాలో రాష్ట్రంలోని కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీలందరి పేర్లు ఉన్నాయి. వీరప్ప మొయిలీ పేరు మాత్రమే లేదు. దీంతో రాజకీవర్గాలలో రకరకాల ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మొయిలీని పక్కన పెట్టేసినట్లేనని కొందరు చెబుతుంటే, ఆయనకే పోటీ చేయడం ఆసక్తి లేదని మరికొందరు చెబుతున్నారు. ఈ ఊహాగానాలు కర్ణాటక కాంగ్రెస్లో పెను సంచలనం సృష్టించాయి. ఎపికి దగ్గరగా ఉండే చిక్ బళ్లాపూర్ నియోజకవర్గంలో తెలుగు వారు అధికంగా ఉంటారు.
2009లో మొయిలీ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసినప్పుడు నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆయనకు మద్దతుగా ప్రచారం చేశారు. మొయిలీ నెగ్గడంలో ఆయన పాత్ర కూడా ఉంది. అయితే, ఇప్పుడు పరిస్థితి మొయిలీకి అనుకూలంగా లేదంటున్నారు. దీంతో ఆయన మరోసారి ఇక్కడి నుండి పోటీ చేసేందుకు సిద్ధంగా లేరట. రాజ్యసభకు పోటీ చేయడమే మేలని మొయిలీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. జులైలో రాష్ట్రం నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
మొయిలీ స్థానంలో చిరు
ఇప్పుడు చిరంజీవి పేరు వినిపిస్తోంది. మొయిలీనీ కాంగ్రెస్ విస్మరించలేదనీ, త్వరలోనే రెండవ జాబితాలో ఆయన పేరు ఉంటుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జి పరమేశ్వర్ స్వయంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఈసారి చిక్ బళ్లాపూర్లో పోటీ తీవ్రంగా ఉంటుందనీ, ఇంత తీవ్రమైన పోటీని ఎదుర్కోవడం మొయిలీకి ఇష్టం లేదని పార్టీ వర్గాలు ఆ తరువాత తెలియజేశాయి. అందుకే ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయడానికి వెనుకాడుతున్నారని పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు.
చిరంజీవి
చిరంజీవిని ఇక్కడి నుంచి పోటీకి దించాలని పార్టీ అధిష్ఠానం తీవ్రంగా ఆలోచిస్తోందట. చిక్ బళ్లాపూర్ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులకు చేరువలోనే ఉన్నది. ఇక్కడ తెలుగు మాట్లాడే ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. అభ్యర్థుల విజయావకాశాలను తేల్చగల శక్తి ఇక్కడి తెలుగువారికి ఉన్నది. అందుకే అధిష్ఠానం చిరంజీవిని ఇక్కడి నుంచి పోటీకి నిలబెట్టవచ్చని పార్టీ వర్గాలు తెలియ జేస్తున్నాయి.
బలమైన నేతలతో
రానున్న ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ అక్కడినుంచి బలమైన స్థానిక నాయకుడిని బరిలోకి దించింది. కర్నాటక మాజీ మంత్రి బిఎన్ బచ్చే గౌడను ఇక్కడి నుంచి పోటీకి దింపాలని బిజెపి నాయకత్వం నిర్ణయించింది. జెడిఎస్ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమార స్వామి సతీమణి అనితా కుమార స్వామి ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారు. ఇంత బలమైన అభ్యర్థులను ఢీ కొనడం కష్టమని మొయిలీ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి.
చిరంజీవి వెళ్తారా?
చిరంజీవి రాష్ట్రం విడిచి వెళ్లే అవకాశాలు లేదంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో చిరంజీవిపై విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆయన రాష్ట్రం విడిచి ఇతర రాష్ట్రాల నుండి పోటీ చేస్తే మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆయన ఎపిని విడిచి ఎక్కడకు వెళ్లరని అంటున్నారు. ఎపి మెగాస్టార్ అయిన చిరంజీవి సొంత రాష్ట్రాన్ని విడిచి మరో రాష్ట్రంలో పోటీ చేయాల్సిన అవసరం అంతగా ఉండదనే వారు లేకపోలేదు.