సిఎం తల తెగ్గొట్టి ఫుట్బాల్ ఆడుతాం: బిజెపి నేత
బెంగళూరు: బీఫ్ రాజకీయాలు తీవ్రమైన స్థాయికి చేరుకుంటున్నాయి. తనకు ఇష్టం వచ్చిన తిండి తింటారని, తినాలనిపిస్తే తాను బీఫ్ తింటానని, అలా తినకుండా తనను ఎవరూ ఆపలేరని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై బిజెపి స్థానిక నాయకుడొకరు తీవ్రమైన హెచ్చరిక చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దమ్ముంటే షిమోగా వచ్చి అక్కడ ఏదైనా అవును చంపి తినాలని బిజెపి జిల్లా కార్యదర్శి చెన్నబసప్ప సవాల్ చేశారు. ముఖ్యమంత్రి వచ్చి అలా చేస్తే తల తెగ్గొట్టి దాంతో ఫుట్బాల్ ఆడుకుంటామని ఆయన అన్నారు. సిద్ధరామయ్య చెబుతున్నది, చేస్తున్నది అంతా తప్పని ఆయన అన్నారు.
"గోమాత తలపై చేతులు వేస్తానని చెప్పడానికి నీకు ఎంత ధైర్యం. గోమాంసం తింటానని నియంతృత్వ ధోరణితో నువ్వు మాట్లాడుతున్నావని.. నీకు దమ్ముంటే నువ్వు ఇక్కడికి వచ్చి గోపి సర్కిల్ (షిమోగా) వచ్చి తిను. అప్పుడు ఏ మాత్రం సందేహం లేదు, నీ తల తెగుతుంద"ని ఆయన అన్నారు.
హిందూ భావోద్వేగాలతో ఆడుకుంటావా అని ఆయన సిద్ధరామయ్యను ప్రశ్నించారు. అలా చేయవద్దని హెచ్చరించారు. సోమవారం జరిగిన ఓ సమావేశంలో ఆయన సిద్ధరామయ్యపై ఆ విధంగా విరుచుకుపడ్డారు. సిద్ధరామయ్య రెచ్చగొట్టే విధంగా ప్రకటన చేశారని ఆయన తప్పు పట్టారు. ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చెన్నబసప్పను పోలీసులు అరెస్టు చేశారు.