పార్టీ ఆదేశాల మేరకే పోటీ..దేశాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్యలు ఇవే: ప్రియాంకా గాంధీ
అయోధ్య: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఎన్నికల బరిలో దిగడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తన ఆసక్తిని కనబర్చారు. భారత్ విజయవంతంగా ప్రయోగించిన మిషన్ శక్తి పై మాట్లాడుతూ ఆమె డీఆర్డీఓకు అభినందనలు తెలిపారు. డీఆర్డీఓను దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 1950లో ప్రారంభించారని ఆమె గుర్తుచేశారు.
చాలా అంశాలు రాజకీయ కోణంలోనే జరుగుతున్నాయి
భారత్ ఎన్నికల వేళ అంతరిక్షంలో ఒక ప్రయోగం చేయడం రాజకీయ కోణంలో చూస్తున్నారా అన్న ప్రశ్నపై ప్రియాంకా స్పందించారు. చాలా అంశాలు రాజకీయ కోణంలోనే జరుగుతున్నాయని ఆమె అన్నారు. ఎన్నికలు వాస్తవికమైన అంశాలపై జరగాలని అదే తాను తన ప్రచారంలో వినిపిస్తున్నట్లు చెప్పారు ప్రియాంకా గాంధీ. ఇక కనీస ఆదాయ పథకం ఒక మోసపూరితమైన హామీగా బీజేపీ చెబుతోందని ప్రియాంకా దృష్టికి తీసుకురాగా... కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 10 రోజుల్లో రైతుల రుణమాఫీలు చేస్తామని హామీ ఇచ్చామని అది చేసి చూపించామని ప్రియాంకా అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ తప్పుడు హామీలు ఇవ్వదని ఆమె స్పష్టం చేశారు. ఏదైతే చేయగలమో అదే హామీలుగా ఇస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. ఎవరైతే అబద్దపు హామీలు ఇస్తారో వారే కాంగ్రెస్ హామీలను విమర్శిస్తారని తెలివిగా సమాధానం చెప్పారు ప్రియాంకా గాంధీ.
ఈ ఎన్నికల ద్వారా దేశాన్ని కాపాడుకోవాలి
ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవని అభిప్రాయపడ్డ ప్రియాంకాగాంధీ... దేశం దశ దిశ మార్చే ఎన్నికలుగా ఆమె అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఈ ఎన్నికలు దేశాన్ని రక్షించగలిగే ఎన్నికలని ఆమె అన్నారు.ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే అది రాహుల్ విజయం కాదన్న ప్రియాంకా గాంధీ... ఆ విజయం దేశ ప్రజలది అవుతుందని చెప్పారు. ఇక అయోద్యలోని రామమందిర స్థలాన్ని సందర్శిస్తారా అని ప్రశ్నించగా.. తన షెడ్యూలు ఇంకా ఖరారు కాలేదని చెప్పుకొచ్చారు ప్రియాంకాగాంధీ.
అంతరిక్షంలో ఉపగ్రహం కూల్చివేత ప్రయోగంపై పాక్ స్పందన..ఏమి చెప్పిందంటే..?
రైతు ఆవేదన, నిరుద్యోగ అంశాలే ప్రధాన సమస్యలు
దేశంలో పేదరికం నిర్మూలిస్తామని కాంగ్రెస్కు చెందిన నాలుగు తరాల నాయకులు చెబుతున్నారని దీనిపై అధికార పక్షం విమర్శలు గుప్పిస్తోందని దీనిపై స్పందించమని అడగ్గా... దేశంలో పేదరికం లేదని చెబుతున్నారా.. అసలు తగ్గుముఖం పట్టలేదని చెబుతున్నారా అని ప్రశ్నించారు ప్రియాంకా గాంధీ. పేదరికం తగ్గుముఖం పట్టిందని అయితే ఇంకా చాలా చేయాల్సి ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఇక ఈ ఎన్నికల్లో రైతుల సమస్యలు ప్రధానాంశంగా నిలుస్తాయని అదే సమయంలో యువతకు సంబంధించి నిరుద్యోగ సమస్య కూడా మరో అంశంగా నిలవనుందని ప్రియాంకా చెప్పారు.