మమతా బెనర్జీని 50వేల ఓట్ల తేడాతో ఓడిస్తా! లేదంటే రాజకీయాలను వదిలేస్తా: సువేందు అధికారి
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ రాజకీయ సవాళ్లు ప్రతిసవాళ్లు చోటు చేసుకుంటున్నాయి. నందిగ్రామ్ స్థానం నుంచి తాను పోటీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సవాల్ విసిరిన కొద్ది సేపటికే.. బీజేపీ నేత సువేందు అధికారి తన ధీటుగా బదులిచ్చారు.
50వేల ఓట్ల తేడాతో మమతా బెనర్జీని ఓడిస్తా
నందిగ్రామ్లో మమతా బెనర్జీని 50వేల ఓట్ల తేడాతో ఓడిస్తానంటూ స్పష్టం చేశారు. ఆ స్థానంలో బెనర్జీని ఢీకొట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అంతేగాక, తాను మమతా బెనర్జీని ఓడించకపోతే రాజకీయాల నుంచే తప్పుకుంటానంటూ సంచలన ప్రకటన చేశారు. సోమవారం కోల్కతాలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలు ఆయన మాట్లాడారు.
లేదంటే రాజకీయాలనే వదిలేస్తానన్న సువేందు అధికారి
నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని మమతా బెనర్జీని అసెంబ్లీ ఎన్నికల్లో 50వేల ఓట్ల తేడాతో ఓడిస్తాను. లేదంటే నేను రాజకీయాల నుంచి వైదొలగుతాను అని సువేందు అధికారి తేల్చేశారు. టీఎంసీ ఇక పార్టీ కాదని, అది ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ అని సువేందు విమర్శించారు.
బీజేపీ సత్తాకు నిదర్శనం అదే..
ఎన్నికల కోసం టీఎంసీ పార్టీ రాజకీయ వ్యూహకర్తలను నియమించుకునేందుకు ప్రయత్నించడమే.. రాష్ట్రంలో బీజేపీకి ఉన్న పట్టుకు నిదర్శనమని సువేందు అన్నారు. మమతా బెనర్జీకి భవానీపూర్లో గెలుస్తాననే నమ్మకం లేదు.. అందుకే నందిగ్రామ్లో కూడా పోటీ చేయనున్నట్లు ప్రకటించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీకి ఓటమి తప్పదని అన్నారు.
Recommended Video
నందిగ్రామ్ నుంచి పోటీ అందుకే..
పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న సువేందు అధికారి.. అధికార టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, సువేందుకు మంచి పట్టున్న నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి కూడా తాను పోటీ చేస్తానని మమతా బెనర్జీ అక్కడ నిర్వహించిన సభలో తెలిపారు. నందిగ్రామ్ కూడా తనకు అదృష్టాన్నిచ్చే ప్రాంతమేనని, అందుకే తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తానంటూ మమతా తెలిపారు. దీంతో మమతా బెనర్జీ, సువేందు అధికారిల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లకు దారితీశాయి. కాగా, ఇప్పటికే పలువురు టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.