లవ్ జిహాద్ చేసేవారిని నాశనం చేస్తాం: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హెచ్చరిక
భోపాల్: లవ్ జిహాద్పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాద్ పేరిట మతమార్పిడి కుట్రలకు పాల్పడే వారిని నాశనం చేస్తామని హెచ్చరించారు. మతమార్పిడి లక్ష్యంతో వివాహం చేసుకునే వారికి 10ఏళ్ల జైలు శిక్ష విధించేలా రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లును రూపొందించిన కొన్ని రోజులకే ఈ మేరకు సీఎం వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే లవ్ జిహాద్కు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చట్టం చేసిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ కూడా అదే బాటలో నడుస్తోంది. వివాహం పేరిట బలవంతపు మతమార్పిడికి పాల్పడినవారికి పదేళ్ల జైలు శిక్ష విధించేలా ముసాయిదా బిల్లును రూపొందించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నప్పటికీ.. శివరాజ్ సర్కారు మాత్రం ముందుకే వెళుతోంది.
తాజాగా, లవ్ జిహాద్ పేరిట బలవంతపు మతమార్పిడి కుట్రలకు పాల్పడితే.. నాశనం చేస్తామంటూ సీఎం శివరాజ్ హెచ్చరించడం గమనార్హం. ప్రభుత్వం ప్రతీ ఒక్కరిదీ.. అన్ని మతాలు, కులాలకు చెందినదని అన్నారు. ఓ మతం, కులం, ప్రాంతం పట్ల ప్రభుత్వం పక్షపాతం చూపదని స్పష్టం చేశారు. కానీ, మా కూతుళ్లతో ఎవరైనా అసహ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తే మాత్రం.. ఊరుకోమని హెచ్చరించారు.
ధర్మ స్వాతంత్ర్యత బిల్లు 2020 ముసాయిదా చట్టం ప్రకారం.. వివాహం కోసం స్వచ్ఛందంగా మతం మారాలని భావిస్తున్నవారు నెల రోజులు ముందుగా జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తరహా కేసుల్లో సంరక్షకులు ఫిర్యాదు చేయవచ్చు. ఇలాంటి వివాహాలను సులభతరం చేసే వారిని నిందితుడిగా పరిగణించడమే కాక, జరిమానా విధిస్తారు. ఈ తరహా కార్యక్రమాలను ప్రోత్సహించే సంస్థల నమోదును రద్దు చేశారు.