వలసదారుల్లో కొందరు క్రిమినల్స్ ఉన్నారు: కర్ణాటక హోం మంత్రి సంచలనం: దాన్ని అమలు చేస్తాం!
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకోబోతోంది. ఈ విషయంలో బీఎస్ యడియూరప్ప ప్రభుత్వానికి అస్సాం ఆదర్శంగా నిలిచింది. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి పార్టీ పెద్దల కనుసైగ కోసం ఎదురు చూస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ నుంచి ఆదేశాలు అందిన వెంటనే ఆ నిర్ణయాన్ని అమలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అదే- వివాదాస్పదంగా మారినట్లు చెబుతున్న జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సీ). రాష్ట్రంలో ఎన్ఆర్సీని అమలు చేయడానికి కేంద్రం అనుమతులు కోసం ఎదురు చూస్తున్నామని కర్ణాటక హోం శాఖ మంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు.
కర్ణాటక గనక ఎన్ఆర్సీని అమలు చేస్తే.. దక్షిణాదిన దీన్ని అమలు చేసిన తొలి రాష్ట్రమౌతుంది. కర్ణాటక వలసదారుల సంఖ్య అత్యధికంగా ఉన్న రాష్ట్రమని, ఎన్ఆర్సీని అమలు చేయాల్సిన అవసరం ఉందని బొమ్మై అన్నారు. గురువారం ఆయన హవేరీలో విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీనీ అమలు చేయాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన సూచనలను తాము పాటిస్తామని అన్నారు. ఇప్పటికే పౌరుల వివరాలను సేకరించే పనిలో ఉన్నామని, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి లభించిన వెంటనే ఎన్ఆర్సీని అమలు చేస్తామని చెప్పారు.
రాజధాని బెంగళూరు సహా మైసూరు, మంగళూరు బీదర్, గుల్బర్గా, విజయపురా.. వంటి ప్రధాన నగరాల్లో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు వందల సంఖ్యలో ఉన్నారని, వారిలో కొందరు క్రిమినల్స్ కూడా ఉన్నారని చెప్పారు. తమ రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడి కర్ణాటకలో తలదాచుకుంటున్నట్లు పోలీసు శాఖ వద్ద పక్కా సమాచారం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్ఆర్సీని అమలు చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తాము కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు వివరిస్తామని బసవరాజ్ బొమ్మై తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చిన నేరస్తులను తమ రాష్ట్రంలో షెల్టర్ ఇవ్వలేమని చెప్పారు.