రజినీ రాజకీయ అరంగేట్రం రేపేనా?: ‘ఎలాగైనా సీఎం చేస్తారు!’
దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రంపై కొనసాగుతున్న ఉత్కంఠకు రేపే తెరపడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మే 19నే అభిమానులతో చివరి సమావేశం ఉండటంతో ఆరోజే రజినీకాంత్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉం
చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రంపై కొనసాగుతున్న ఉత్కంఠకు రేపే తెరపడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మే 19నే అభిమానులతో చివరి సమావేశం ఉండటంతో ఆరోజే రజినీకాంత్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.
దేవుడు తలిస్తే..
దేవుడు తలిస్తే తాను రాజకీయాల్లో వస్తానని ఇటీవల రజినీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తమిళ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్గా మారిపోయింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాలు అస్తవ్యస్తమయ్యాయి. దీంతో రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ తీవ్రమయ్యాయి.
పలు పార్టీల ప్రయత్నాలు
రజినీకాంత్ను తమ పార్టీలో చేర్చూకోవాలని పలు పార్టీలు కూడా ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ కాస్తా ముందేవుంది. పలుమార్లు బీజేపీ రాష్ట్ర నేతలు.. రజినీతో సంప్రదింపులు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ.. రజినీ ఇంటికి వెళ్లి కలిసి వచ్చారు.
సొంత పార్టీనే బెటర్
ప్రస్తుతం అభిమానులతో సమావేశం అవుతున్న రజినీకాంత్.. తొలిసారి రాజకీయాలపై మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. రజినీకాంత్ను తమ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు సిద్ధంగా ఉంది బీజేపీ. ఈ క్రమంలో ఆయన ఆ పార్టీ వైపు మొగ్గుచూపుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఆయన అభిమానులు మాత్రం సొంతపార్టీ పెట్టి రాజకీయాల్లో వస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రజినీ రావాల్సిందే..
నటుడు మాధవన్, దర్శక నటుడు చేరన్ తదితరులూ రజినీ రాజకీయాల్లోకి రావాలంటూ కోరుతున్నారు. చెన్నైలో మంగళవారం మాధవన్ మీడియాతో మాట్లాడుతూ... ఏది మంచిదో రజనీకాంత్కు బాగా తెలుసని, ఆయన రాజకీయాల్లోకి వస్తే మంచిదేనన్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తానని తెలిపారు.
ఎలాగైనా సీఎం చేస్తారు?
కాగా, నటుడు, దర్శకుడు చేరన్ మాట్లాడుతూ.. ఎలాగైనా రజనీకాంత్ను అభిమానులు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతారని, రాజకీయ పరిస్థితులు అందుకు అనుకూలిస్తాయని తెలిపారు. ప్రజల్లో నేడు నిజాయతీ కొరవడిందని, అందువల్ల రజనీ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. దోపిడీ, అవినీతి, స్వార్థం కలగలిసిన ఈ రాజకీయాలు సరిపోతాయా? అని రజనీ ఆలోచించుకోవాలని పేర్కొన్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే కర్ణాటకను (నీటి అంశం విషయంలో)వ్యతిరేకించాలని, హిందీకి మద్దతివ్వకూడదని, ఉచితాలు ఇవ్వాల్సిందేనని, మద్యం దుకాణాలను మూసివేయకూడదని, ఇలా పలు సవాళ్లు ఉన్నాయని తెలిపారు. రజనీ రాజకీయాల్లోకి రావాలంటే క్షేత్రస్థాయిలో పని చేసి ప్రజలతో మాట్లాడాలని, వారి సమస్యలు తెలుసుకోవాలని చేరన్ పలు కీలక సూచనలు చేశారు.