2024 నాటికి ఒక్క చొరబాటుదారుడు దేశంలో ఉండరు, ఎన్ఆర్సీపై అమిత్ షా..
2024 నాటికి ఒక్క చొరబాటుదారుడు కూడా దేశంలో ఉండరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. ఇప్పటికే అసోంలో జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (ఎన్ఆర్సీ) జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్న కేంద్రం మాత్రం ముందుకెళ్తుంది. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేస్తామని కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ప్రకటిస్తున్నారు.
జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో రాజ్నాథ్ ప్రకటించిన మరుసటి రోజే అమిత్ షా కామెంట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సోమవారం అమిత్ షా సింగ్బూమ్లో ప్రచారం నిర్వహించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి దేశంలో ఒక్క చొరబాటుదారుడు ఉండరని అమిత్ షా పేర్కొన్నారు.
చొరబాటుదారులకు దేశంలో ఉండే హక్కు లేదని అమిత్ షా పేర్కొన్నారు. ఇప్పుడే కాదు.. ఇదివరకు కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. రాజ్యసభలో కూడా అమిత్ షా ఎన్ఆర్సీ గురించి తెలిపిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ స్థానాల్లో పరాజయం పాలైంది. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలుచేస్తామని ప్రకటించడంతోనే ప్రజలు అలా తీర్పిచ్చారనే విపక్షాలు చెప్తున్నారు. మరోవైపు బెంగాల్లో జాతీయ పౌరసత్వ రిజిస్టర్ అమలు చేసేందుకు అంగీకరించబోనని దీదీ మమతా బెనర్జీ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.