జైలు శిక్ష పడకుండా కాపాడాడు, ప్రధానిని చేస్తాడు, కొడుకును కాదని అమర్పై ప్రేమ
సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సమస్యలను తానే కారణమనే ఆరోపణలను అమర్ సింగ్ ఖండించారు.అయితే ములాయం గుండెల్లో నుండి తనను తీసివేస్తే తాను భాదపడతానని ఆయన ప్రకటించారు.
న్యూఢిల్లీ :సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభానికి తానే కారనమే ఆరోపణలను పార్టీ ప్రధానకార్యదర్శి అమర్ సింగ్ తోసిపుచ్చారు. అయితే ములాయం సింగ్ యాదవ్ గుండెల్లో నుండి తనను తీసివేస్తే ఆ క్షణం తాను భరించలేనిదంటూ అమర్ సింగ్ వ్యాఖ్యానించారు.అమర్ సింగ్ కు ములాయం ఎందకు ప్రాధాన్యత ఇస్తారు, తనయుడు వద్దని వారించినా అమర్ సింగ్ ను ములాయం ఎందుకు నెత్తిమీద పెట్టుకొంటాడనే చర్చ పార్టీలో సాగుతోంది. తన వ్యూహచతురతతో ప్రధానిని చేస్తారని ములాయం అమర్ సింగ్ ను నమ్ముతారని ములాయం సన్నిహితులు చెబుతారు.
పార్టీలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ములాయంకు అస్వస్థకు గురయ్యారని సమాచారం అందుకొన్న వెంటనే లండన్ నుండి అమర్ సింగ్ నేరుగా ఢిల్లీకి చేరుకొన్నారు.పార్టీలో సంక్షోభానికి తాను కారణం కాదని ఆయన మరోసారి ప్రకటించారు.
సమాజ్ వాదీ పార్టీలోకి అమర్ సింగ్ పున: ప్రవేశం తర్వాతే ఆ పార్టీలో సంక్షోభం తీవ్రమైంది. అమర్ సింగ్ కేంద్రంగా అఖిలేష్ ఆరోపణలు చేస్తున్నారు. అమర్ సింగ్ ను పార్టీలోకి తీసుకోవడాన్ని అఖిలేష్ వ్యతిరేకించాడు.
అమర్ సింగ్ రాకను తనయుడు అఖిలేష్ యాదవ్ వ్యతిరేకించినా ములాయం సింగ్ పెద్దగా పట్టించుకోలేదు. తనయుడు అభ్యంతరాలు పెట్టినా వినకుండా అమర్ సింగ్ ను పార్టీలోకి తీసుకొన్నాడు.
శివపాల్ యాదవ్ , అమర్ సింగ్ లు తనకు వ్యతిరేకంగా పార్టీలో పనిచేస్తున్నారని అఖిలేష్ యాదవ్ భావించాడు. పార్టీ రెండు గ్రూప్ లుగా విడిపోయింది. ఒక గ్రూప్ కు అఖిలేష్ యాదవ్, మరో గ్రూప్ కు ములాయం నాయకత్వం వహించే పరిస్థితి నెలకొంది.
అమర్ సింగ్, ములాయం సింగ్ ల మధ్య పరిచయం ఎలా జరిగింది
1985 లో జనతా పార్టీ ప్రతినిధిగా ములాయం సింగ్ యాదవ్ శాసనమండలిలో విపక్షనేతగా వ్యవహరించేవాడు. ఆ సమయంలోనే అమర్ సింగ్ తో ములాయం సింగ్ కు పరిచయమైంది. యూపి రాష్ట్రంలో బలమైన రాజ్ పుత్ సామాజిక వర్గానికి చెందిన అమర్ సింగ్ తో ములాయం దోస్తి కొనసాగించాడు. 1989 లో ములాయం నేతృత్వంలో జనతాదళ్ ప్రభుత్వం యూపిలో ఏర్పాటైంది.అయితే జనతాదళ్ నుండి విడిపోయి సమాజ్ వాదీ పార్టీని ఏర్పాటుచేసుకొన్న తర్వాత అమర్ సింగ్, ములాయం సింగ్ ల మధ్య బందం మరింత పెరిగింది.1992లో ములాయం సింగ్ పార్టీని ఏర్పాటుచేసిన సమయంలో అమర్ సింగ్ ములాయం వద్దే ఉన్నారు. 1996 లో సమాజ్ వాదీ పార్టీలో అమర్ సింగ్ చేరారు. 1996 లో యూనైటెడ్ ప్రభుత్వంలో సమాజ్ వాదీ పార్టీ చేరే సమయంలో అమర్ సింగ్ కీలకంగా వ్యవహరించారని సన్నిహితులు చెబుతారు.
అమర్ సింగ్ , ములాయం సింగ్ మద్య ప్రేమకు కారణాలు ఏమిటి ?
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ములాయం సింగ్ యాదవ్ ఉన్న కాలంలో అమర్ సింగ్ ఆయనకు మరింత దగ్గరయ్యారు. తనను జైలు శిక్ష నుండి తప్పించారనే భావం కూడ ములాయంకు అమర్ సింగ్ పై ఉంది. మరో వైపు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకుగాను పెద్ద పారిశ్రామిక వేత్తలను రప్పించడంలో ఆయన కృషిని ములాయం పదేపదే గుర్తు చేసుకొనేవాడు.అంతేకాదు పార్టీలోకి సినిమా తారలు చేరేలా అమర్ సింగ్ ప్రోత్సహించారని , తద్వారా పార్టీకి ప్రయోజనం కలిగిందనేది ములాయం భావన. పార్టీలో అమర్ సింగ్ కంటే గొప్ప వ్యూహకర్త మరోకరు లేరనే ములాయం సింగ్ నమ్ముతారు.అందుకే కొడుకును సైతం పక్కన పెట్టి అమర్ సింగ్ కు ప్రాధాన్యత ఇస్తారని ములాయం సింగ్ సన్నిహితులు చెబుతారు.
యూపి పార్టీ పగ్గాలు అమర్ చేతుల్లోనే
యూనైటెడ్ ప్రభుత్వంలో ములాయం సింగ్ యాదవ్ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ములాయం సింగ్ కు అమర్ సింగ్ అన్ని వ్యవహరాలను చక్కబెట్టేవాడు. అదే సమయంలో ఉత్తర్ ప్రదేశ్ లో పార్టీ పగ్గాలు అమర్ సింగ్ చేతుల్లో ఉండేవి. 2003 సంవత్సరంలో యూపిలో సమాజ్ వాదీ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చాక ములాయం సింగ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే ఆ సమయంలో ములాయం ప్రభుత్వం అమర్ సింగ్ కు యూపి డెవలప్ మెంట్ కౌన్సిల్ చైర్మెన్ పదవిని కట్టబెట్టింది.పారిశ్రామిక వేత్తలకు, యూపి ప్రభుత్వానికి మద్య అమర్ సింగ్ వారధిగా పనిచేశాడు.అమితాబచ్చన్, జయా బచ్చన్, రాజ్ బబ్బర్ లాంటి సిని తారలు పార్టీలో చేరేలా చేశారు అమర్ సింగ్.ములాయం సింగ్ యాదవ్ ప్రధానమంత్రి అవుతారని అమర్ సింగ్ చెప్పేవారు.అయితే అమర్ సింగ్ వ్యూహరచన వల్లే తాను ప్రధానమంత్రిని అవుతానని ములాయం సింగ్ విశ్వసించేవారని ఆయన సన్నిహితులు చెబుతారు.
అఖిలేష్ రాకతో అమర్ కు చెక్
ములాయం సింగ్ తనయుడు అఖిలేష్ యాదవ్ రాజకీయ రంగ ప్రవేశంతో అమర్ సింగ్ చెక్ పడింది.కుటుంబసభ్యులను కాకుండా బయటి వ్యక్తులను తన తండ్రి అతిగా నమ్ముతారని అఖిలేష్ బహిరంగంగానే వ్యాఖ్యలు చేశాడు. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన తర్వాత తాను రాజీనామా చేసిన ఫిరోజాబాద్ పార్లమెంట్ స్థానం నుండి తన భార్య డింపుల్ ను అఖిలేష్ రంగంలోకి దింపాడు.అయితే అమర్ సింగ్ మాత్రం దీన్ని వ్యతిరేకించాడు.డింపుల్ కు వ్యతిరేకంగా రెబెల్ అభ్యర్థిని అమర్ సింగ్ రంగంలోకి దించాడు. ఆయనకు మద్దతును బహిరంగంగానే ప్రకటించాడు. అయితే ఈ ఎన్నికల్లో డింపుల్ విజయం సాధించింది. దీంతో అమర్ సింగ్ పై పార్టీ సస్సెన్షన్ వేటు వేసేలా ములాయం సింగ్ ను ఒప్పించాడు అఖిలేష్. ఈ మేరకు ఆయను ఆనాడు పార్టీ నుండిఆరేళ్ళ పాటు బహిష్కరించారు.ఇటీవలే ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకొన్నారు.
అమర్ సింగ్ రాకతోనే సంక్షోభం
ఇటీవలనే పార్టీలోకి అమర్ సింగ్ ను ములాయం సింగ్ యాదవ్ తీసుకొన్నారు. అయితే అమర్ సింగ్ పార్టీలో చేరడాన్ని అఖిలేష్ వ్యతిరేకించాడు. పార్టీలో సంక్షోభాలకు అమర్ సింగ్ కారణమని అఖిలేష్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు.అయితే ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీని తన చేతుల్లోకి తీసుకొన్నారు అఖిలేష్ యాదవ్. ఆదివారం నాడు జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో అమర్ సింగ్ ను, శివపాల్ యాదవ్ లను పార్టీ నుండి తప్పించింది అఖిలేష్ వర్గం. అమర్ సింగ్ వ్యూహరచనతో కొడుకు నుండి పార్టీ నుండి తన గుప్పిట్లోకి తెచ్చుకోవచ్చని ములాయం భావిస్తున్నారు.మరో వైపు జనవరి ఐదవ తేదిన నిర్వహించతలపెట్టిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని కూడ ములాయం సింగ్ వాయిదా వేసుకొన్నాడు.ఇప్పటికే మెజారిటీ పార్టీ నాయకులు ములాయం ను వీడి అఖిలేష్ వైపుకు రావడంతో ఈ పరిస్థితి నెలకొంది.