Nirbhaya verdict:సుప్రీంకు వెళతామన్న లాయర్..తీర్పుపై ఎవరేమన్నారు..?
న్యూఢిల్లీ: 2012 నిర్భయ అత్యాచార ఘటనకు సంబంధించి ఢిల్లీలోని పటియాలా కోర్టు తీర్పు వెలువరించింది. నలుగురు నిందితులను జనవరి 22న ఉరితీయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆర్డర్ జారీ చేసిన తేదీ నుంచి ఉరి తీసే తేదీ మధ్యన నిందితులు క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేస్తామని నిర్భయ కేసులో నిందితుల తరపున వాదించిన లాయర్ తెలిపారు.
సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్
నిర్భయ ఘటనలో నిందితులకు ఉరిశిక్ష విధించాలని తీర్పు చెప్పడంతో నిందితుల తరపున లాయర్ ఏపీ సింగ్ సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు. మరో రెండు రోజుల్లోనే ఈ పిటిషన్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. మీడియా ఒత్తిడి, ప్రజాగ్రహం, రాజకీయ ఒత్తిళ్లు కేసుపై మొదటి నుంచి ప్రభావం చూపాయని చెప్పిన ఆయన విచారణ నిష్పక్షపాతంగా జరగలేదని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే నిందితుల తరపున క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు.
ఇది ప్రతి మహిళ విజయం: నిర్భయ తల్లి
ఇదిలా ఉంటే నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష వేయడంపై నిర్భయ తల్లి సంతోషం వ్యక్తం చేశారు. తన కూతురుకు న్యాయం జరిగిందని తీర్పు వెలువడిన తర్వాత ఆమె చెప్పారు. నలుగురు నిందితులకు ఉరివేస్తే దేశంలోని ప్రతి మహిళ సంతోషిస్తుందని ఆమె చెప్పారు. అంతేకాదు ఈరోజు ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు.. న్యాయవ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకాన్ని కలిగేలా చేసిందని వ్యాఖ్యానించారు.
ఈ దారుణానికి పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టాలి
ఆలస్యంగానైనా సరే తన కూతురికి న్యాయం జరిగిందని అన్నారు నిర్భయ తండ్రి బద్రినాథ్ సింగ్. నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు చెప్పిన తీర్పు తర్వాత ఆయన మాట్లాడారు. కోర్టు ఇచ్చిన తీర్పుతో ఎవరైనా ఇలాంటి దారుణానికి పాల్పడాలంటే వెన్నులో వణుకు పుడుతుందని వ్యాఖ్యానించారు. కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆనందం వ్యక్తం చేశారు బద్రినాథ్ సింగ్.
ఏడేళ్లు పోరాడిన ఆ తల్లిదండ్రులకు సెల్యూట్
మరోవైపు నిర్భయ ఘటనలో పటియాలా కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్. నిర్భయలాంటి ఘటనలు ఈ దేశంలో చాలా జరిగాయని ఈ తీర్పు వారందరి విజయంగా ఆమె అభివర్ణించారు. ఈ కేసులో న్యాయం పొందేందుకు ఏడేళ్ల పాటు పోరాడిన నిర్భయ తల్లిదండ్రులకు ఆమె సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఇంత దారుణం జరిగిందని తెలిసినప్పటికీ వారికి ఉరిశిక్ష వేసేందుకు ఏడేళ్ల సమయం ఎందుకు పట్టిందని ఆమె ప్రశ్నించారు. ఇలాంటి కేసుల్లో ఎక్కువ సమయం తీసుకోకూడదని ఆమె అభ్యర్థించారు.