గూర్ఖాలూ ఆందోళన వద్దు! మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: అమిత్ షా
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న గూర్ఖాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా స్పష్టం చేశారు. మనదేశం రాజ్యాంగం చాలా విశాలమైనదని, ఏ సమస్యనైనా పరిష్కరించేందుకు చోటు ఉంటుందని చెప్పారు.
బీజేపీ అధికారంలోకి వస్తే గూర్ఖా సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు డబుల్ ఇంజరీ ప్రస్తుతం గూర్ఖా మీ సమస్యల పరిష్కారం కోసం గూర్ఖాల ఎవరూ మళ్లీ ఆందోళన చేయాల్సిన పరిస్థితి రాకుండా చేస్తామన్నారు.
గూర్ఖాలను ఎవరూ హాని తలపెట్టలేరని భరోసా కల్పించారు. ఎన్నార్సీనీ అమలు చేసే కార్యక్రమం ఇంకా మొదలు కాలేదని, ఒక వేళ ఆ కార్యక్రమం ప్రారంభమైన గూర్ఖాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాగా, ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దాలుగా గూర్ఖాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. 2017 నుంచి మరోసారి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు.
గూర్ఖాలు అత్యధిక సంఖ్యలో ఉండే డార్జిలింగ్ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫుల్ స్టాప్ పెట్టారని విమర్శించారు. మమత ఎందరినో చంపించారని, మరెందరిపైనో కేసులు పెట్టించారని... బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు ఎదుర్కొంటున్న వారందరికీ విముక్తి కలిగిస్తామని హామీ ఇచ్చారు.
పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ఈసారి విజయం సాధించాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు టీఎంసీ కూడా మరోసారి అధికారం చేపట్టేందుకు తీవ్ర కసరత్తులే చేస్తోంది. ఇప్పటికే నాలుగు విడదల అసెంబ్లీ ఎన్నికలు జరుగగా.. మిగిలిన స్థానాలకు ఈ నెలలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. మే 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి.