ఆ రెండు పార్టీలతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: శరద్ పవార్
ముంబై: శివసేన , ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని పూర్తిగా ఐదేళ్లు ప్రభుత్వంలో ఉంటాయని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చెప్పారు. మధ్యంతర ఎన్నికలు మహారాష్ట్రలో రావని స్పష్టం చేశారు. ఏ ఒక్క పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో ప్రస్తుతం ఆ రాష్ట్రం రాష్ట్రపతి పాలన కింద ఉంది. మూడు పార్టీలు కామన్ మినిమమ్ ప్రోగ్రామ్కు ఓకే చెప్పాయని చెప్పిన శరద్ పవార్ శనివారం రోజున గవర్నర్ను మూడు పార్టీల ప్రతినిధులు కలుస్తారని చెప్పారు.
Maharashtra Politics:శివసేనకు మద్దతుపై శరద్ పవార్ ఏమన్నారంటే..?
గత వారం సీఎం పదవికి రాజీనామా చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ శివసేన ఎన్సీపీ ప్రభుత్వం ఆరునెలలకంటే ఎక్కువగా ఉండదని చెప్పారు. ఫడ్నవీస్ వ్యాఖ్యలపై స్పందించిన పవార్... తనకు దేవేంద్ర ఫడ్నవీస్ చాలా కాలంగా తెలుసునని అయితే జోతిష్యం కూడా చెబుతారని తెలియదని శరద్ పవార్ సైటైర్ వేశారు. ఇక మళ్లీ తానే ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడుతానన్న ఫడ్నవీస్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని శరద్ పవార్ తెలిపారు. మళ్లీ వస్తాను మళ్లీ వస్తాను అని చెబుతుంటే తాను ఏదో అనుకున్నట్లు చెప్పిన శరద్ పవార్... ఫడ్నవీస్ మాటల ద్వారా మీడియా మరో సమాచారం ఇస్తోందన్నారు.
ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా శివసేన అభ్యర్థే ఉండాలని ఆ పార్టీ ఏమైనా కండీషన్స్ పెట్టిందా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు శరద్ పవార్. రొటేషన్ పద్ధతిలో ముఖ్యమంత్రి పదవి పంచుకోవాలని చెబుతూ శివసేన పార్టీతో ప్రభుత్వ ఏర్పాటుకు తానే ముందుగా వచ్చినట్లు గుర్తు చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి పదవిపైనే ఉన్న శివసేన... బీజేపీతో సంబంధాలు తెంపుకుందని ఆ పదవినే ఎన్సీపీ ఆఫర్ చేసిందని మరో ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ చెప్పారు. కామన్ మినిమమ్ ప్రోగ్రాంకు సంబంధించిన అన్ని పార్టీలకు డ్రాఫ్ట్ను పంపామని చెప్పిన నవాబ్ మాలిక్.. ఇక రైతు సమస్యలు, నిరుద్యోగం అంశాలపై దృష్టిసారిస్తామని చెప్పారు.