22 మంది ఎంపీలు గెలిస్తే 24 గంటల్లో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం: యడ్యూరప్ప సంచలనం
బెంగళూరు: సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ 22 లోకసభ స్థానాలు గెలుచుకుంటే ఆ తర్వాత 24 గంటల్లో కర్ణాటక రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఇటీవల జరిగిన ఓ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.
మోడీ కారణజన్ముడా, ప్రముఖులకు ఓటమి తప్పదా?: జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారంటే?
ఆషామాషీగా చెప్పడం లేదు
ఈ విషయాన్ని తాను ఆషామాషీగా చెప్పడం లేదని, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడున్న కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వం కూలిపోతుందని, దీంతో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని యడ్యూరప్ప చెప్పారు. ఆ పార్టీల మధ్య ఇప్పటికే లుకలుకలు ఉన్న విషయం తెలిసిందే. ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు... కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉండటం ఏమాత్రం ఇష్టం లేదని చెప్పారు.
జేడీఎస్-కాంగ్రెస్ మధ్య లుకలుకలు
మొత్తం 28 లోకసభ స్థానాలున్న కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీ 16, కాంగ్రెస్ 9, జేడీఎస్ నుంచి ఇద్దరు ఎంపీలు పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏడు ఫేజ్లలో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో ఏప్రిల్ 18వ తేదీన జరగనున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్, జేడీఎస్ల మధ్య అసంతృప్తులు వెలుగు చూస్తున్నాయి.
ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు
ఇటీవల పుల్వామా దాడి అనంతరం పాకిస్తాన్లోని బాలాకోట్లోని జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. ఆ సమయంలో యడ్యూరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ బీజేపీకి అనుకూలంగా మారిందని, దీంతో కర్ణాటకలో బీజేపీ 22 లోకసభ స్థానాలను గెలుచుకుంటుందన్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.