అరెస్ట్ అయిన విద్యార్థులకు సాయం: అమెరికాలోని భారత కాన్సులేట్, హాట్ లైన్ ఏర్పాటు
న్యూఢిల్లీ: అమెరికాలో అరెస్టైన విద్యార్థులకు అన్ని విధాలుగా సాయం అందిస్తున్నట్లు అమెరికాలోని భారత రాయబారి హర్షవర్ధన్ తెలిపారు. వేర్వేరే ప్రాంతాల్లో అరెస్టయిన విద్యార్థులను కలిసేందుకు అధికారులను పంపించామని చెప్పారు. సోమవారం నాటికి అందరినీ కలిసి న్యాయ సహాయం అందిస్తామన్నారు. దీనికి తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. విద్యార్థులకు సాయం అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
అమెరికా పైన భారత్ సీరియస్గా ఉంది. ఢిల్లీలోని అమెరికా రాయబారికి విదేశాంగ శాఖ నిరసన తెలిపింది. ఫార్మింగ్టన్ యూనివర్సిటీ మూసివేత, భారత విద్యార్థుల అరెస్టుపై భారత్ నిరసన తెలిపింది. ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ డిఫెన్స్లో పడింది. ప్రభుత్వమే అడ్డదోవన వెళ్లడం ఏమిటని అమెరికన్ లాయర్లు ప్రశ్నిస్తున్నారు.
తమ విద్యార్థులను మీరే ఎలా మోసం చేస్తారని భారత్ ప్రశ్నిస్తోంది. బాధిత విద్యార్థుల్లో తెలుగువారు ఎక్కువగా ఉన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం అమెరికాపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నాయి. మరోవైపు, తెలుగు విద్యార్థులకు సాయం చేసేందుకు తెలుగు సంఘాలు ముందుకు వచ్చాయి. కాగా, తెలుగు విద్యార్థులను ట్రాప్ చేసేందుకు సదరు ఫేక్ యూనివర్సిటీ తెలుగు దళారులకు రూ.2 కోట్లు చెల్లించిందట.
విద్యార్థుల కోసం హాట్లైన్
అరెస్టైన భారతీయ విద్యార్థులకు సహకారం అందించడం కోసం అమెరికాలోని భారత కాన్సులేట్ కార్యాలయం 24 గంటలు పనిచేసే హాట్లైన్ను తెరిచింది. అమెరికాలోనే ఉండాలనే ఉద్దేశంతో నకిలీ విశ్వవిద్యాలయంలో చేరిన విద్యార్థుల్లో ఇప్పటివరకు 130 మందిని అరెస్ట్ చేయగా, వారిలో 129 మంది భారత్కు చెందినవారేనని ఇమ్మిగ్రేషన్ అధికారులు వెల్లడించారు.
అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ డిపార్టుమెంట్ అధికారులు డెట్రాయిట్లో ఫార్మింగ్టన్ యూనివర్సిటీ పేరిట ఓ నకిలీ యూనివర్సిటీని స్థాపించి అండర్కవర్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ వలలో చిక్కుకుని అరెస్టయిన భారతీయ విద్యార్థుల కోసం భారత ఎంబసీ తాజాగా హాట్లైన్ను ఏర్పాటు చేసింది. 24 గంటలూ అందుబాటులో ఉండేలా 202-322-1190, 202-340-2590 రెండు హెల్ప్లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. అలాగే అరెస్టయిన విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు [email protected] అనే ఈమెయిల్ ద్వారా ఎంబసీ అధికారులను సంప్రదించవచ్చని చెప్పింది.