చొరబడితే మృతదేహాలు మోసుకెళ్లాల్సిందే: పాక్కు భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్
న్యూఢిల్లీ: భారత్లోకి చొరబడేందుకు యత్నిస్తే చొరబాటుదారుల మృతదేహాలను తీసుకెళ్లేందకు పాకిస్తాన్ అధికారులు రావాల్సి ఉంటుందని హెచ్చరించారు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. ఈ మధ్యకాలంలో పాక్ నుంచి చొరబాట్లు తగ్గిపోయాయని చెప్పిన బిపిన్ రావత్... ఇందుకు కారణం భారత సరిహద్దుల్లో జవాన్లు గస్తీ చాలా బలంగా ఉందని కొనియాడారు. ఒకవేల చొరబాటుకు ప్రయత్నిస్తే తమ వారి శవాలను తీసుకెళ్లేందుకు రావాల్సి ఉంటుదన్న సంగతి పాకిస్తాన్కు తెలుసని ఆర్మీ చీఫ్ చెప్పారు.
పుల్వామా దాడులకు తాము బాధ్యులం కాదన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఖండించారు. ఇమ్రాన్ఖాన్ ఒప్పుకోనంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదని చెప్పారు. పుల్వామా దాడులు ఎలా జరిగాయో అందరికీ తెలుసని చెప్పారు. ఇప్పటికే భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పుల్వామాలో ఏం జరిగిందన్న దానిపై సరిపడా సమాచారంను సేకరించారని తెలిపారు.
ఇదిలా ఉంటే పాకిస్తాన్కు బిపిన్ రావత్ హెచ్చరికలు జారీ చేయడం ఇది తొలిసారి కాదు. అంతకు ముందు కూడా పాక్ చొరబాటు దారులను ప్రోత్సహిస్తే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. పాకిస్తాన్ చీటికీ మాటికీ భారత్లోకి చొరబడే యత్నం చేస్తోందన్నారు. అది భారత సైన్యంను రెచ్చగొట్టడం కానీ, ఆ దేశం నుంచి భారత్లోకి ఉగ్రవాదులను పంపడం కానీ, లేదా చొరబాట్లను ప్రోత్సహించడం ద్వారా పదేపదే కవ్వింపు చర్యలకు దిగుతోందన్నారు.అయితే భారత భూభాగంను ఎలా కాపాడుకోవాలో మనసైన్యంకు బాగా తెలుసని అన్నారు బిపిన్ రావత్. ప్రస్తుతం పరిస్థితులన్నీ సాధారణంగానే ఉన్నాయని స్పష్టం చేశారు బిపిన్ రావత్.