‘కర్ణాటక’ను మహారాష్ట్రలో కలిపేస్తాం -సీఎం ఉద్ధవ్ సంచలనం -మళ్లీ తెరపైకి బెల్గామ్ సరిహద్దు వివాదం
మరాఠాల కోసమే పుట్టుకొచ్చిన శివసేన పార్టీ.. సుదీర్ఘకాలం బీజేపీకి మిత్రుడిగా కొనసాగి.. ప్రస్తుతం కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని నడుపుతోంది. బీజేపీ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ తనవైన వ్యూహాలతో ముందుకుపోతోన్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన రీతిలో మరోసారి బెల్గామ్ సరిహద్దు వివాదం అంశాన్ని తెరపైకి తెచ్చారు.

ఆ ప్రాంతాలను కలిపేసుకుంటాం..
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఆక్రమించిన మరాఠ మాట్లాడే ప్రాంతాలను తిరిగి తమ రాష్ట్రంలో కలుపుకుంటామని అన్నారు. ఇదే అమరులకు తామిచ్చే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. ‘కర్ణాటక ఆక్రమించిన మహారాష్ట్ర భాషా, సంస్కృతితో ముడిపడి ఉన్న ప్రాంతాలను వెనక్కు తెస్తాం. సరిహద్దు వివాదంలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు ఇదే తామిచ్చే నిజమైన నివాళి. ఇందుకోసం ఐక్యంగా కట్టుబడి పనిచేస్తాం. అమరుల గౌరవార్థం ఇదే వారికి మా వాగ్దానం' అని సీఎం కార్యాలయం ట్విట్టర్లో పేర్కొంది.

ఏమిటీ బెల్గామ్ సరిహద్దు వివాదం?
గతంలో ముంబై ప్రెసిడెన్సీలోని బెల్గామ్తోపాటు ఇతర ప్రాంతాలు ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతున్నాయి. భాషా ప్రాతిపదికన వీటిని మహారాష్ట్రంలో కలపాలని దశాబ్దాలుగా డిమాండ్ వినిపిస్తున్నది. బెల్గామ్తోపాటు పలు ప్రాంతాలను తమ రాష్ట్రంలో కలపాలని మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ప్రాంతీయ సంస్థ) 1956లో పోరాటానికి శ్రీకారం చుట్టింది. ఈ పోరాటంలో జనవరి 17న పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వీరి త్యాగానికి గుర్తుగా యేటా జనవరి 17ను మహారాష్ట్ర ప్రభుత్వం అమరుల దినోత్సవంగా నిర్వహిస్తున్నది.

సుప్రీంకోర్టులో పంచాయితీ..
కర్ణాటక- మహారాష్ట్ర మధ్య ఏండ్లుగా సరిహద్దు వివాదం నడుస్తున్నది. బెల్గామ్తోపాటు పలు సరిహద్దు ప్రాంతాలపై సుప్రీం కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయి. సరిహద్దు వివాద కేసు సంబంధ విషయాలను పర్యవేక్షించేందుకు మంత్రులు ఏక్నాథ్ షిండే, ఛాగన్ భుజ్బల్ను సీఎం ఉద్దవ్ ఠాక్రే గతేడాది కో- కోఆర్డినేటర్లుగా నియమించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పు కంటే ముందే మహా సీఎ ఠాక్రే.. కర్ణాటకలోని ప్రాంతాలను కలిపేసుకుంటామంటూ ప్రకటన చేయడం దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్నది..
కరోనా: చైనాకు పాకిస్తాన్ ఝలక్ -డ్రాగన్ను కాదని సీరం తయారీ కొవిషీల్డ్ వ్యాక్సిన్కు అనుమతి