అప్పుడే చేరికల పర్వం : ఎన్డీఏ క్యాబినెట్లో చేరతామంటున్న అన్నాడీఎంకే, జేడీయూ
న్యూఢిల్లీ : మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం ఈసీ ఏర్పాట్లు కూడా చేస్తోంది. అయితే అప్పుడే కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని భావిస్తున్నారు. దీంతో భాగస్వామ్యపక్షలైన అన్నాడీఎంకే, జేడీయూ కేంద్ర క్యాబినెట్లో చేరతామని సంకేతాలిచ్చాయి.
జేడీయూ, అన్నాడీఎంకే ఓకే ?
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో చేరబోతున్నామని జేడీయూ, అన్నాడీఎంకే పార్టీ తెలిపాయి. కేంద్ర క్యాబినెట్లో తమ బెర్తులను అందరికంటే ముందే ఖరారు చేసుకున్నాయి. ఈ మేరకు జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్, అన్నాడీఎంకే నేత పన్నీరు సెల్వం తాము ఎన్డీఏ ప్రభుత్వంలో చేరబోతున్నామని సూత్రప్రాయంగా తెలిపారు.
అప్పుడ నో .. ఇప్పుడు ఎస్ ...
గత ఎన్నికల్లో ఎన్డీఏకు నితీశ్ కుమార్ అంటిముట్టనట్టుగానే వ్యవహరించారు. సొంతంగా పోటీ చేశాడు. కానీ ఈసారి మాత్రం ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నారు. ఈ క్రమంలో మంగళవారం బీజేపీ చీఫ్ అమిత్ షా ఇచ్చిన విందుకు కూడా హాజరయ్యారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రిపిట్ అవుతాయనే విశ్వాసం వ్యక్తం చేశారు. తిరిగి మోదీ ప్రధాని కావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యపార్టీగా ఉంటామని స్పష్టంచేశారు.
అన్నాడీఎంకే కూడా ...
నితీష్ వెర్షన్ ఇలా ఉంటే తమిళనాడులో అధికార అన్నాడీఎంకే కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. అయితే తొలుత ఎగ్జిట్ పోల్ అంచనాలను తోసిపుచ్చి .. తిరిగి ఎన్డీఏ ప్రభుత్వంలో చేరతామని ఇండికేషన్ ఇచ్చింది. తాము ఎన్డీఏతో కలిసి పనిచేసే అంశాన్ని పార్టీ నిర్ణయిస్తుందని పన్నీరు సెల్వం తెలిపారు. ఈ అంశంపై పార్టీలో అందరి అభిప్రాయం తీసుకుంటామని చెప్పారు. అయితే వాస్తవానికి ఇప్పటికే అగ్రనేతలు .. ఎన్డీఏలో చేరాలనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది.