మోదీకి మద్దత్తిస్తే చంపేస్తాం..! ఇస్రో మాజీ ఛైర్మన్ కు జైషే ఉగ్రవాద సంస్థ బెదిరింపులు..!!
తిరువనంతపురం/హైదరాబాద్ : దేశం సార్వత్రిక ఎన్నికల్లో మునిగిపోయిన సమయంలో ప్రజలు ఉలిక్కిపడే సంఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. తమ మాట వినకుంటే చంపేస్తామని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మాజీ చైర్మన్, బీజేపీ నాయకులు జి. మాధవన్ నాయర్కు ఓ బెదిరింపు లేఖ వచ్చింది. లేఖలో ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వొద్దని, ఒక వేళ మద్దతిస్తే మాధవన్ నాయర్ ని చంపేస్తామని పేర్కొన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా, మాధవన్ నాయర్ను దీనిపై విలేకరులు ప్రశ్నించగా.. తనకు ఆ లేఖ గురించి తెలియదని చెప్పారు. కానీ దీనిపై నిఘా సంస్థల వద్ద సమాచారం ఉన్నట్లు తనకు తెలిపారని స్పష్టం చేశారు.
పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే ఉగ్రవాద సంస్థ నుంచి ఈ లేఖ వచ్చినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇస్రో చైర్మన్గా ఉన్న మాధవన్ నాయర్ 2009లో పదవీ విరమణ చేశారు. గతేడాది అక్టోబర్లో మాధవన్ బీజేపీలో చేరారు. ఆయన చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో మాధవన్ ని సత్కరించిన సంగతి తెలిసిందే.
కాగా మాధవన్ కు వచ్చిన బెదిరింపు లేఖపై కేరళ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో దేశంలో ఉన్నతాదికారులకు, రక్షణరంగంలో పనిచేసే వారికి, పని చేసి వదవీ విరమణ చేసిన వారికి భద్రత కల్పించే దిశగా కేంద్రం సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.