చంపేస్తాం: ఉగ్రవాదుల హిట్ లిస్టులో ప్రధాని మోడీతోపాటు విరాట్ కోహ్లీ పేరు
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ తోపాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హిట్ లిస్టులో ఉన్నారు. వీరితోపాటు ఆల్ ఇండియా లష్కరే తోయిబాగా పేరు మార్చుకున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా తమ టార్గెట్ జాబితాలో హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లను కూడా చేర్చినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.
జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్కు ప్రత్యేకంగా ఈ ఉగ్రవాద సంస్థను నెలకొల్పింది లష్కరే తోయిబా. దీని ద్వారా ప్రముఖులను టార్గెట్ చేసి ఉగ్రవాదులను హతమార్చినందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేశాయి.
కాగా, ఉగ్రవాద హిట్ లిస్ట్తో కూడిన లేఖను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అందుకుంది. ఈ లేఖను ఆల్ ఇండియా లష్కరే తోయిబా హైపవర్ కమిటీ, కోజికోడ్ నుంచి పంపినట్లు తెలిసింది. లష్కరే పంపిన హిట్ లిస్ట్లో బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అద్వానీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్ పేర్లు కూడా ఉండటం గమనార్హం.
భారత్లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పర్యటిస్తున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఇరు జట్లు నవంబర్ 3న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టీ20 మ్యాచ్లో తలపడనున్నాయి.
ఎన్ఐఏ వర్గాలు ఈ లేఖను బీసీసీఐకి పంపడంతో ఢిల్లీ పోలీసులు టీమిండియా సభ్యులకు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే, ఈ బెదిరింపు లేఖ నకిలీదని ఎన్ఐఏ వర్గాలు భావిస్తున్నప్పటికీ.. పాక్ ఉగ్రవాదుల నుంచి ముప్పుపొంచి ఉన్నందున భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ముంబై దాడులు సహా పలు ఉగ్రదాడులకు లష్కరే తోయిబా పాల్పడిన విషయం తెలిసిందే.