వచ్చే లోకసభ ఎన్నికల్లో పోటీ: అద్వానీ, మురళీ మనోహర్ జోషిలదే నిర్ణయం
న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అగ్రనేతలు లాల్ కృష్ణ అద్వానీ (91), మురళీ మనోహర్ జోషీల (84) పోటీపై నిర్ణయాన్ని వారికే వదిలేసినట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఆ పార్టీలో 75 ఏళ్ల కంటే పైబడిన వారికి పోస్టులు ఇవ్వకపోవడం మంచిదనే నిర్ణయం ఉంది. వారు పార్టీ సీనియర్లు కాబట్టి ఆ నిర్ణయాన్ని వారికే వదిలేశారు.
2014 లోకసభ ఎన్నికల్లో అద్వానీ గాంధీ నగర్ నుంచి పోటీ చేసి గెలిచారు. మురళీ మనోహర్ జోషి కాన్పూర్ నుంచి విజయం సాధించారు. ఎన్నికల్లో పోటీ కోసం ఎలాంటి వయో పరిమితి లేదని, కానీ పదవుల విషయంలో (కేంద్రమంత్రులు) ఉందని చెప్పారు.
అద్వానీ, మురళీ మనోహర్ జోషిలు మార్గదర్శక్ మండలిగా బీజేపీ పేర్కొంది. అంటే పార్టీని ఈ స్థాయికి తీసుకురావడం, సీనియర్లు కావడంతో వారికి సూచనలు, సలహాలు ఇచ్చే గౌరవప్రదమైన పోస్టు ఇచ్చారు.
ఇదిలా ఉండగా, అనారోగ్య కారణాలతో సుష్మాస్వరాజ్, ఉమాభారతిలు కూడా ఎన్నికలకు దూరంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. మురళీ మనోహర్ జోషికి అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి మాట్లాడుతూ.. పార్టీ తీసుకునే నిర్ణయం మేరకు జోషి నడుచుకుంటారన్నారు.