ఆశ్చర్యం: 'నేను నోరు విప్పితే ఉద్యోగం పోతుంది'
ముంబై: భారతదేశ ఆర్ధికస్ధితిగతులను నిర్దేశించడంలో ఆయన దిట్ట. ఆయన ప్రసంగిస్తున్నారంటే ఆర్ధికశాస్త్ర విద్యార్ధులు ఆసక్తిగా వింటారు. అంతేకాదు వారి సందేహాల నివృత్తి కోసం ఆయన ఏం సమాధానాలు చెప్తారా? అంటూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు.
ఆయనే చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణియన్. కానీ దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులను రాజేసిన బీఫ్ వివాదపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ఈ అంశంపై ఓ విద్యార్ధి అడిగిన ప్రశ్నకు గాను ఆసక్తికర సమాధానం ఇచ్చారు. మంగళవారం ముంబై యూనివర్శిటీలో 'సామాజిక ఉద్రిక్తతలు - అభివృధ్దిపై వాటి ప్రభావం' అనే అంశంపై ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా బీఫ్ నిషేధం, రైతుల ఆదాయం, గ్రామీణ భారతం అభివృద్ది లాంటి అంశాలపై మాట్లాడారు. ఈ సమయంలో బీఫ్ అంశంపై స్పందించి తన ఉద్యోగం పోవాలని కోరుకోవడం లేదని ఆయన సమాధానమిచ్చారు. 'విద్యార్థులుగా మీకు ప్రశ్నించే స్వేచ్ఛ ఉంది. కానీ నేను అలాకాదు. నేను మాట్లాడితే నా ఉద్యోగం పోతుంది. అలా కావాలని నేను కోరుకోవడంలేదు' అని చెప్పారు.
ఆయన సమాధానంతో విద్యార్థులు ఆశ్చర్యానికి లోనయ్యారు. తన ఉద్యోగం పోతుందనే బీఫ్ వివాదంపై తాను నోరు మెదపడం లేదన్నారు. బీఫ్ నిషేధం వల్ల దాని ప్రభావం రూరల్ గ్రామాల్లో రైతుల ఆదాయం తదితర విషయాలపై స్పందించడానికి నిరాకరించిన ఆయన ఇంతవరకు తనను ఆ ప్రశ్న అడగనందుకు ధన్యవాదాలు తెలిపారు.
వాషింగ్టన్లోని పీటర్సన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనమిక్స్కు పనిచేస్తున్న ఆయన 2014 అక్టోబర్ నుండి నుంచి సెలవులో ఉన్నారు. భారత్లో బీఫై నిషేధం ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. బీఫ్ ఇంట్లో దాచాడానే ఆరోపణలతో ఉత్తరప్రదేశ్లోని దాద్రిలో ఓ ముస్లిం ఇంటిపై బీజేపీ నేతలు చేసిన దాడిలో ఒక వ్యక్తి చనిపోయిన సంగతి తెలిసిందే.