కాశీలో మోదీ ఆదిక్యం పెరుగుతుందా ? తగ్గుతుందా..? ఆద్యాత్మిక నగరంలో బీజేపి ప్లస్ లు మైనస్ లు..!!
Recommended Video
వారణాసి/హైదరాబాద్ : ఇప్పుడు దేశంలో ఎక్కడ విన్నా వారణాసి పేరే మారుమోగిపోతోంది. బెనారస్ పట్టుచీరల నుంచి రైలింజిన్ల ఉత్పత్తివరకు అనేక రకాల ప్రత్యేకతలున్న వారణాసికి రాజకీయంగానూ అమిత ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే ప్రధాని నరేంద్రమోదీ వరుసగా రెండోసారి ఇక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారు. గురువారం భారీర్యాలీ నిర్వహించిన ఆయన, శుక్రవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేసారు. చిట్టచివరి దశలో మే 19న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఒడిశాలోని పూరీ నుంచి కూడా బరిలోకి దిగుతారని తొలుత ప్రచారం జరిగినా చివరకు మోదీ వారణాసి వైపే మొగ్గు చూపించారు. 2014 ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయడం వల్లనే యూపీలో 80కి 71 ఎంపీ సీట్లను తాము దక్కించుకోగలిగామని బీజేపి బలంగా నమ్ముతోంది.
ఓ పక్క ఢమరుక నాధాలు..!మరో పక్క ప్రచార హోరు..! సందడిగా మారిన కాశీపురం..!!
దేశంలోనే అది ఆద్యాత్మిక నియోజకవర్గం. దేశంలో ఆ పేరును గాని, ఆ ప్రాశస్త్యాన్ని గుర్తించని వారు గానీ ఉండరు. వారణాసి, కాశీ, బెనారస్, ఏ పేరుతో పిలిచినా అది సాక్షాత్తూ పరమశివుడు కొలువైన దివ్యధామం. సంస్కృతి-సంప్రదాయాల కలబోత. భక్తి ప్రపత్తులతో గంగలో స్నానం చేసి, కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకుని పుణ్యాన్ని మూటగట్టుకోవాలని తాపత్రయపడే భక్తుల సందోహం ఒకపక్క, రాజకీయ నేతల కోలాహలం మరోపక్క. గుడి గంటలు, ఢమరుక నాదాలకు ఇప్పుడు ఎన్నికల రణన్నినాదాలూ జోడయ్యాయి. గంగామాతకిచ్చే హారతుల నడుమ అభ్యర్థులకూ పలుచోట్ల హారతులు పడుతున్నారు.
త్రిముఖ సమరంలో గెలుపు నల్లేరుపై నడకే..! ప్రియాంక వైదొటగడం బీజేపికి కలిసొచ్చే అంశం..!!
మోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని కొన్నాళ్లుగా ప్రచారం జరిగింది. అక్కడి నుంచి తానెందుకు పోటీ చేయకూడదని స్వయంగా ఆమే ఇటీవల ఒకసారి విలేకరులను ప్రశ్నించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది. చివరకు కాంగ్రెస్ తరఫున పాత అభ్యర్థి అజయ్రాయ్కు టికెట్ను ఖరారు చేయడంతో బరిలో ప్రియాంక లేరనేది స్పష్టమయింది. వారణాసిలో మోదీని ఢీకొని గెలవగలమనే ఆశ ఆ పార్టీలో లేకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి తరఫున ఎస్పీ అభ్యర్థి శాలినీ యాదవ్ పోటీ చేస్తున్నారు. త్రిముఖ సమరంలో ఓట్లు చీలిపోయి, మోదీ లాభపడతారని, ఆయన గెలుపు నల్లేరుపై నడకేనని బీజేపి వర్గాలు ధీమాగా చెప్పుకొస్తున్నాయి.
8 లక్షల ఆధిక్యమే లక్ష్యం..! ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపి నేతలు..!!
2014లో మోదీ సాధించిన 3.71 లక్షల ఆధిక్యాన్ని ఈసారి 8 లక్షలకు పెంచాలనేది భాజపా లక్ష్యంగా పెట్టుకుంది. ఆరు నెలల క్రితమే దీనినొక సవాల్గా తీసుకుని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసింది బీజేపి అదిష్టానం. జిల్లా, డివిజన్, నియోజకవర్గ స్థాయి సమీక్షలతో శ్రేణులను సమాయత్తం చేసే ప్రణాళిక రూపొందించారు బీజేపి సీనియర్ నేతలు. 2014 తరహాలోనే వ్యూహ రచనకు పార్టీ తరఫున వార్రూం సన్నాహాలు మొదలుపెట్టింది. అయిదేళ్లలో సుమారు 3000 కోట్ల రూపాయల విలువైన 39 ప్రాజెక్టులు ప్రారంభించారు ప్రధాని మోదీ. గంగా ప్రక్షాళన, పరిశుభ్రతకు పెద్దపీట వేసారు. పురాతన నగర పరిరక్షణకు విస్తృత చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం, ప్రతిష్టాత్మక హోమీభాభా క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించారు. అంతే కాకుండా మొట్టమొదటి వందేభారత్ ఎక్స్ప్రెస్ ఇక్కడి నుంచే ప్రారంభించారు మోదీ.
కొన్నింటిలో మాత్రం అసంతృప్తి..! కానీ గెలుపును అడ్డుకోలేవంటున్న బీజేపి శ్రేణులు..!!
ప్రసిద్ధిగాంచిన బొమ్మల తయారీ పరిశ్రమ అంతరించిపోయే దశకు చేరినా బీజేపి అంత శ్రద్ద చూపలేదనే విమర్శలు ఉన్నాయి. బెనారస్ చీరల తయారీపై ఆధారపడిన నేత కార్మికులు ఉపాధిని వెతుక్కుంటూ బెంగళూరు తదితర నగరాలకు వలసలు వెళ్తున్నా అదికారంలో ఉండి కూడా బీజేపి ప్రభుత్వం పట్టించుకోలేదనే అపవాదు ఉంది. విశ్వనాథ్ కారిడార్ పనుల్లో భాగంగా కొన్ని కూల్చివేతలు చేపట్టాల్సి వచ్చింది. బాధిత పక్షాలు దీనిపై అసంతృప్తితో ఉన్నాయి. ఇవన్ని భారతీయ జనతా పార్టీ విజయాన్ని ప్రభావితం చేయలేవనే చర్చ కాషాయ పార్టీలో జోరుగా సాగుతోంది.