కేరళలో బీజేపీకి మోహన్ లాల్ 'ట్రంప్కార్డ్'?: మోడీతో భేటీ, ఏం చెప్పారంటే?
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీలో చేరతారని గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరుస్తూ ప్రముఖ మలయాళీ నటుడు మోహన్ లాల్ ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సోమవారం ప్రధానిని కలిసి శ్రీకృష్ణుని ప్రతిమను అందించారు.
శశిథరూర్కు చెక్..
కాగా, 2019 లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో మోహన్ లాల్ బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. తిరువనంతపురం లోకసభ స్థానం నుంచి మోహన్ లాల్ను బరిలో దించేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రయత్నిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. కాగా, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రస్తుతం ఆ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. శశిథరూర్కు చెక్ పెట్టేందుకే మోహన్ లాల్ను తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది.
సురేష్ గోపీ తర్వాత.. మోహన్ లాల్..
కేరళలో గత ఎన్నికల్లో ఓట్ షేర్ పెంచుకున్న బీజేపీ.. ఎక్కువ సీట్లను మాత్రం సాధించలేకపోయింది. కేంద్రమాజీ మంత్రి ఓ రాజగోపాల్ ఒక్కరే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలుపొందడం గమనార్హం. కాగా, ఇప్పటికే ప్రముఖ మలయాళీ నటుడు సురేష్ గోపీ భారతీయ జనతా పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన సేవలను బీజేపీ వినియోగించుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేసిన ఆయన.. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
కేరళను ఆదుకుంటామన్నారు..
ఇప్పుడు మోహన్ లాల్ కూడా బీజేపీలో చేరితే రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసుకోవచ్చని భావిస్తోంది. కాగా, గతంలో పలుమార్లు మోహన్ లాల్.. బీజేపీ, నరేంద్ర మోడీకి మద్దతుగా నిలిచారు. పెద్ద నోట్ల రద్దుతో అవినీతి తగ్గుతుందని ఆయన వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాన్యులకు పెద్ద పీట వేస్తోందని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీని మోహన్ లాల్ ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీతో భేటీ తర్వాత మోహన్ లాల్ మాట్లాడుతూ.. వరదల కారణంగా నష్టపోయిన కేరళను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని మోడీ చెప్పారని తెలిపారు. ‘కొత్త కేరళ' నిర్మాణం కోసం నిర్వహిస్తున్న గ్లోబల్ మలయాళీ రౌండ్ టేబుల్లో పాల్గొంటానని చెప్పినట్లు తెలిపారు.
అభినందించిన మోడీ..
క్యాన్సర్ కేర్ సెంటర్ ద్వారా సేవలందిస్తుండటంపై ప్రధాని కార్యాలయం అభినందనలు తెలిపిందని మోహన్ లాల్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. తన విశ్వశాంతి ఫౌండేషన్ అందిస్తున్న సామాజిక సేవల గురించి ప్రధానికి వివరించినట్లు మోహన్ లాల్ తెలిపారు. కాగా, మోహన్ లాల్తో భేటీపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. మోహన్ లాల్ చేస్తున్న సామాజిక సేవ స్ఫూర్తివంతమైనదని కొనియాడారు.