జాతిపితను కించపరిచిన సాధ్విని క్షమించే ప్రసక్తే లేదు: తొలిసారి నోరువిప్పిన మోడీ
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సే ఓ గొప్ప దేశభక్తుడని పొగిడేసిన భారతీయ జనతాపార్టీ భోపాల్ లోక్సభ అభ్యర్థిని సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మరిన్ని చిక్కుల్లో పడిపోయారు. ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించే ప్రసక్తే లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఆమెపై చర్యలు తీసుకుంటామని అన్నారు. సాధ్వీ ప్రజ్ఞాసింగ్ సహా కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే, లోక్సభ సభ్యుడు నళిన్ కుమార్ కటీల్ ఇదే తరహా వ్యాఖ్యానాలు చేయడంతో వారందరికీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నోటీసులను జారీ చేశారు. పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాలని సూచించారు.
1988లో మోడీ ఇమెయిల్ వాడారా? ఆ ఛాన్సే లేదే: భారతీయ ఇంటర్నెట్ పితామహుడు
ఆ నోటీసులు జారీ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే మోడీ కూడా ఈ అంశంపై స్పందించారు. ఓ నేషనల్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ - జాతిపితను కించపరిచిన సాధ్విని క్షమించలేనని అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీకి సంబంధించిన అంశాలపై వివాదాస్పదంగా మాట్లడటానికి ముందు ప్రజలు వందసార్లు ఆలోచించాలని సూచించారు.
మాలేగావ్ పేలుళ్ల కేసలో ప్రధాన నిందితురాలిగా విచారణను ఎదుర్కొన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఎనిమిదేళ్ల పాటు కారాగారవాసాన్ని అనుభవించారు. అనంతరం ఆమె బెయిల్పై విడుదల అయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఆమె బీజేపీలో చేరారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి లోక్సభ అభ్యర్థినిగా ప్రకటించిందా పార్టీ. కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్నారు. చివరి దశ ఎన్నికల్లో భాగంగా- ఈ నెల 19వ తేదీన భోపాల్ లోక్సభ స్థానానికి పోలింగ్ నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగుతోంది. జాతిపితను కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సే మొట్టమొదటి హిందూ ఉగ్రవాది అని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యానాల పట్ల ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ నిరసన వ్యక్తం చేశారు. గాడ్సేను దేశభక్తునిగా అభివర్ణించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు క్షణాల వ్యవధిలో దావానలంలా వ్యాపించాయి. బీజేపీయేతర రాజకీయ పార్టీలు ముప్పేట దాడి చేశాయి. బీజేపీ కూడా ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చింది. అనంతరం- సాధ్వీ తాను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పారు. అప్పటికే- జరగాల్సిన నష్టం జరిగిపోయింది.