నేను పాటలు ఆపను: ఫత్వాపై ముస్లీం యువతి, సీఎం అండ
పాటలు పాడటం ఆపేయాలని ఓ ముస్లీం యువతికి మతపెద్దలు ఫత్వా జారీ చేశారు. దాదాపు యాభై మంది మతపెద్దలు ఆమెకు దీనిని జారీ చేశారు. ప్రభుత్వం మాత్రం ఆమెకు అండగా నిలబడింది.
గౌహతి: పాటలు పాడటం ఆపేయాలని ఓ ముస్లీం యువతికి మతపెద్దలు ఫత్వా జారీ చేశారు. దాదాపు యాభై మంది మతపెద్దలు ఆమెకు దీనిని జారీ చేశారు. ప్రభుత్వం మాత్రం ఆమెకు అండగా నిలబడింది.
ఈ సంఘటన అసోంలో చోటు చేసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో పాటలు పాడకూడదంటూ గాయని నహీద్ అఫ్రీన్కు ఫత్వా జారీ చేశారు. ఆమెకు ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్ అండగా నిలిచారు.
నాహిద్ అఫ్రీన్ స్థానికంగా రియాల్టీ షోలు, కార్యక్రమాల్లో పాటలు పాడుతుంటుంది. అయితే బహిరంగ వేదికలపై పాటలు పాడటం ఇస్లాం మత విధానాలకు విరుద్ధమని చెబుతూ మతపెద్దలు ఆగ్రహించారు.
ఫత్వా జారీని సీఎం సోనోవాల్ ఖండించారు. యువ టాలెంట్పై ఆంక్షలు విధించడం సరికాదంటూ ట్వీట్ చేశారు. కళాకారులకు రక్షణ కల్పించడం తమ ప్రభుత్వం బాధ్యత అన్నారు. అఫ్రీన్కు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
మరోవైపు, ఫత్వా జారీ, సీఎం అండగా నిలబడటంపై నహీద్ అఫ్రీన్ కూడా స్పందించారు. పాటలు పాడటం దేవుడిచ్చిన వరమని, దానిని ఆపేస్తే దేవుడిని లెక్కచేయనట్లేనని, అందుకే ఎప్పటికీ పాడటం మాత్రం మానేయనని చెప్పారు. ఫత్వాకు భయపడేది లేదని చెప్పారు. చివరి ఘడియ వరకు పాడుతానన్నారు.
తనకు అల్లా పాడటం కోసం గొంతు ఇచ్చారని, తనకు మద్దతుగా అసోం, దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుంచి సందేశాలు వస్తున్నాయని ఆమె చెప్పారు. కాగా, సెంట్రల్ అసోంలోని ఉడాలిలో మసీదు, గ్రేవ్ యార్డ్ దగ్గరగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాడటం పైన విమర్శలు వస్తున్నాయని అంటున్నారు. అలాగే, బహిరంగంగా పాడటం షరియా చట్టాలకు విరుద్ధమని కూడా మతపెద్దలు అంటున్నారట.