నిర్భయ కేసు: వేర్వేరుగా ఉరిశిక్ష అమలుపై 11న తేల్చనున్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరితీసేందుకు అనుమతివ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను ఫిబ్రవరి 11 విచారిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం శుక్రవారం పరిశీలించింది.
నిర్భయ కేసు: ఉరిశిక్షపై స్టే ఎత్తివేయాలన్న కేంద్రం పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దేశ సహనాన్ని పరీక్షించింది చాలు.. ఇక వారిని ఉరితీసేందుకు అనుమతించాలని కోరారు. నలుగురు దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా ఐదు సంవత్సరాలుగా క్షమాభిక్ష పిటిషన్ చేయకుండా ఉన్నాడని సొలిసిటర్ జనరల్ ఆరోపించారు.
కేంద్రం వేసిన పిటిషన్కు సంబంధించి నిర్భయ దోషులకు నోటీసులు జారీ చేయాలని మెహతా కోరారు. అయితే, ఇందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. కాగా, నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరితీసేందుకు అనుమతివ్వాలని కోరుతూ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దోషులకు వేర్వేరుగా శిక్షలు అమలు చేసేందుకు ఆదేశాలు ఇవ్వబోమని తేల్చిచెప్పింది. దీంతో కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఇది ఇలావుంటే, నిర్భయ దోషులను ఉరితీసేందుకు కొత్త తేదీ ఇవ్వాలని కోరుతూ మరోసారి తీహార్ జైలు అధికారులు ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ శుక్రవారం విచారణ జరగనుంది. కాగా, ఇప్పటికే నిర్భయ దోషులకు విధించిన మరణశిక్ష అమలు రెండుసార్లు వాయిదా పడింది.
పవన్ గుప్తా మినహా ముగ్గురు దోషులు రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థనలు పెట్టుకోగా అవి తిరస్కరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలోనే దోషులకు సంబంధించిన ఎటువంటి పిటిషన్లు పెండింగ్లో లేవని ఉరిశిక్ష అమలుకు కొత్త తేదీ ప్రకటించాలని కోరుతూ తీహార్ జైలు అధికారులు కోర్టును ఆశ్రయించారు.