మరణశిక్షా లేక: నిర్భయ కేసులో తీర్పుపై ఉత్కంఠ, నేడే జడ్జిమెంట్
న్యూఢిల్లీ: ఆరేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం కేసులో సుప్రీం కోర్టు తీర్పు కోసం దేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్ పైన సోమవారం అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది.
నిందితులకు ట్రయల్ కోర్టు.. ఢిల్లీ హైకోర్టు ఖరారు చేసిన మరణ శిక్షలను గత ఏడాది మేలో సుప్రీం కోర్టు ఖరారు చేసింది. అయితే సుప్రీం తీర్పును సమీక్షించాలని కోరుతూ దోషులు ముఖేష్ (29), పవన్ (22), వినయ్ (23)ల తరఫున పిటిషన్ దాఖలైంది.
మరో నిందితుడు అక్షయ్ కుమార్ సింగ్ (31) కూడా పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. కాగా రివ్యూ పిటిషన్ పైన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు భానుమతి, అశోక్ భూషణ్ల ఆధ్వర్యంలో ధర్మాసనం విచారణ చేపట్టి, తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ రోజు తీర్పు వెలువరించనుంది. వారి మరణశిక్షను అమలు చేయాలని తీర్పునిస్తుందా లేక జీవిత ఖైదుగా మారుస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది.
కాగా, 16 డిసెంబర్ 2012న భారత రాజధాని ఢిల్లీలో ఒక వైద్య విద్యార్థినిని కదులుతున్న బస్సులో ఆరుగురు కర్కశంగా, దారుణంగా ఇనుప కడ్డీతో కొట్టి అత్యాచారం చేశారు. ఆ సంఘటనలో తల మరియు పేగులకు తగిలిన గాయాలతో 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు 29 డిసెంబర్ 2012 న ఆమె తుదిశ్వాస విడిచారు.