ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేయను: షీలా దీక్షిత్ వైరాగ్యం
న్యూఢిల్లీ: ఢిల్లీ శానససభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, ఈ విషయం తాను ఇదివరకే చెప్పానని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెసు నేత షీలా దీక్షిత్ అన్నారు. అయితే కాంగ్రెసు తరఫున ప్రచారం మాత్రం చేస్తానని ఆమె బుధవారం మీడియాతో అన్నారు.
కాంగ్రెసు ప్రచార సారథిగా అజయ్ మాకెన్ను ఎంపిక చేయడంపై ప్రతిస్పందిస్తూ, కొత్త తరం నాయకుడిని ఎంపిక చేసుకోవడం మంచిదని ఆమె అన్నారు. అజయ్ మాకెన్ పార్లమెంటు సభ్యుడని, కేంద్రంలో ఇంతకు ముందు పనిచేశారని, తన మంత్రివర్గంలో కూడా పనిచేశారని, అనుభవం ఉందని, కొత్త ముఖం కూడా అని ఆమె అన్నారు.
ఢిల్లీ శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి 7వ తేదీన జరగనున్నాయి. ఫిబ్రవరి 10వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. గత ఫిబ్రవరి నుంచి ఢిల్లీ రాష్ట్రపతి పాలన కింద ఉంది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం 49 రోజుల పాటు పాలన సాగించి, దిగిపోయింది. దాంతో రాష్ట్రపతి పాలన అనివార్యంగా మారింది.
కాగా, బిజెపి, ఆమ్ ఆద్మీ పార్టీలు ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడుతాయని సర్వేలు తెలియజేస్తున్నాయి. బిజెపికి మెజారిటీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా చెబుతున్నాయి. కాంగ్రెసు తన పరిస్థితిని మెరుగు పరుచుకునే ఆలోచనలో ఉంది.