పార్టీ, పార్టీ సిద్ధాంతాలు అక్కర్లేదు: యడియూరప్పకు ఫడ్నవీస్ డైరెక్ట్ వార్నింగ్
ముంబై: కర్నాటక మహారాష్ట్ర సరిహద్దు వివాదం మళ్లీ రాజుకుంది. కర్నాటకలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో విలీనం చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. దీంతో కర్నాటక రాష్ట్రం ఒక్కసారిగా భగ్గుమంది. తాజాగా మహారాష్ట్ర బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీ స్టాండ్ను పక్కనపెట్టి కర్నాటకలోని మరాఠీ మాట్లాడే ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదని కర్నాటక ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీనిపై బీజేపీ స్టాండ్ను కాదని వ్యతిరేకంగా స్వరం పెంచారు.
కర్నాటక ఆక్రమిత మహారాష్ట్రలో మరాఠీ సోదరులకు మహారాష్ట్ర ఎప్పుడూ అండగా నిలుస్తుందని చెప్పారు దేవేంద్ర ఫడ్నవీస్. ఈ విషయంలో పార్టీ, పార్టీ సిద్ధాంతాలను పక్కనబెట్టి అండగా ఉంటామని చెప్పారు. బెల్గాం, కార్వార్ ప్రాంతాలను మహారాష్ట్రలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో కర్నాటక ప్రభుత్వం తమ మరాఠీ సోదరులకు అన్యాయం చేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు దేవేంద్ర ఫడ్నవీస్.
మహారాష్ట్రలో నెలకొన్న సరిహద్దుల వివాదం సుప్రీంకోర్టులో ఉండగా దాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కార్ విస్మరిస్తోందని మహారాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆరోపించారు. అంతేకాదు కర్నాటకకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం అడుగుతు వేస్తోందని మండిపడ్డారు. కర్నాటక మహారాష్ట్ర సరిహద్దుల వివాదం ఈ నాటిది కాదు. కొన్ని దశాబ్దాలుగా ఇది నడుస్తోంది. అయితే తాజాగా కన్నడ సంస్థ ఒకటి మహారాష్ట్ర ఏకీకరణ్ సమితిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ పాత వివాదం రాజుకుంది.