కర్ణాటక ప్రభుత్వంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు: ఒకరు పరమేశ్వర, మరొకరు?
బెంగళూరు: కొత్తగా ఏర్పడే కర్ణాటక ప్రభుత్వంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలకు చోటు కల్పించే అవకాశం ఉందంటున్నారు. దళిత నేత, కేపీసీసీ చీఫ్ డా.పరమేశ్వర్ కి ఇప్పటికే డిప్యూటీ సీఎం పదవి ఖరారు కాగా.. మరో కాంగ్రెస్ నేతకు కూడా డిప్యూటీ సీఎం పదవి వరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలోని లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేల అభీష్టం మేరకు శామ్నూర్ శివశంకరప్పను కూడా డిప్యూటీ సీఎంగా నియమిస్తారని తెలుస్తోంది. ఢిల్లీలో సోనియా, రాహుల్ లతో కుమారస్వామి మంతనాల తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, బుదవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ మరుసటి రోజే విశ్వాస పరీక్షను ఎదుర్కొంటామని ఆయన ఇదివరకే చెప్పారు. విశ్వాస పరీక్షలో కుమారస్వామి నెగ్గిన తర్వాత డిప్యూటీ సీఎంలతో ప్రమాణస్వీకారం చేయించే అవకాశం ఉంది.
కాగా, శనివారం నాడు అంతా ఉత్కంఠగా ఎదురుచూసిన బలనిరూపణకు యడ్యూరప్ప రాజీనామాతో తెరపడిన సంగతి తెలిసిందే. తమకు మెజారిటీ లేదని యడ్యూరప్ప అంగీకరించడంతో సీఎంగా ఆయన కేవలం 55గం.కే పరిమితమయ్యారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ముందస్తు ఒప్పందం ప్రకారం కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. సోమవారమే ఆయన ప్రమాణస్వీకారం చేయాల్సి ఉన్నా.. నేడు రాజీవ్ గాందీ వర్ధంతి కారణంగా బుధవారానికి వాయిదా వేశారు.